ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గోదావరి ఉదృతంగా ప్రవహిస్తొంది. నదీ పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా 15 మంది పాడి రైతులు పశువుల కోసం వెళ్లి వరదలో చిక్కుకున్నారు. దాదాడు ఏడు కిలో మీటర్లు నదిలో కొట్టుకుపోయిన వాళ్లను అధికారులు సురక్షితంగా వడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
విషయంలోకి వెళితే.. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం యలకల్లంక కు చెందిన 15 మంది పాడి రైతులు లంకలో ఉండే తమ పశువులను వడ్డుకు తీసుకువచ్చేందుకు ఇంజెక్షన్ పడవపై వెళ్లారు. రైతులు పశువులను తీసుకువస్తుండగా.. గోదావరి మధ్యలోనే వీరి పడవ ఆగిపోయింది. దీంతో వీరు గోదావరి వరద ఉదృతికి సుమారు ఏడు కిలో మీటర్లు యానాం వద్ద మసకపల్లి వరకూ కొట్టుకుపోయారు. వీరు నదిలో కొట్టుకుపోతుండగా గమనించిన రైతులు.. అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు అప్రమత్తమై కోటిపల్లి నుండి ఇంజన్ బోట్ల సాయంతో వెళ్లి ఆ పాడి రైతులను కాపాడారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో వీరు తమ ప్రాణాలను కాపాడిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
గోదావరికి పోటెత్తున్న వరద .. ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు