Volunteers: రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఒకే సారి 33 మంది గ్రామ వాలంటీర్లపై అధికారులు వేటు వేశారు. 33 మంది వాలంటీర్లను విధుల నుండి తొలగిస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి ఉత్తర్వులు జారీ చేశారు. కారణంగా ఏమిటంటే.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఫీవర్ సర్వే జరుగుతోంది. అయితే ఇక్కడి వాలంటీర్లు ఆన్ లైన్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని వేటు వేశారు. విధులను సక్రమంగా నిర్వహించకుండా కరోనా ఫీవర్ సర్వేలో జ్వరం లేని వారికి కూడా ఉన్నట్లు ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేశారనే అరోపణతో వీరిపై చర్యలు తీసుకున్నారు. కాకినాడ, అర్బన్, కాకినాడ రూరల్, రాజమండ్రి అర్బన్, తుని, రాజోలు, అమలాపురం, మామిడికుదురు ప్రాంతాలకు చెందిన వార్డు, గ్రామ వాలంటీర్లను తొలగించినట్లు సమాచారం.
కొందరు వాలంటీర్లు క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి నివేదిక తయారు చేస్తుండగా మరి కొందరు వాలంటీర్లు ఆఫీసులో కూర్చుని ఫీవర్ సర్వేలో పేర్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ప్రభుత్వానికి తప్పుడు నివేదిక వెళ్లినట్లు తెలుస్తోంది.
Read more: YSRCP: సొంత గూటికి చేరేందుకు ఆ టీడీపీ మాజీ మంత్రి ప్రయత్నాలు ఫలించేనా..!?
ఇటీవల కరోనా పరిస్థితులపై రివ్యూలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఫీవర్ సర్వే పై అధికారులకు పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకోవాలన్నారు. అయితే కొందరు వాలంటరీల వల్ల వాస్తవ రిపోర్టు రావడం లేదని భావించిన అధికారులు పరిశీలన జరపగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్క సారిగా 33 మందిపై వేటు వేసినట్లు సమాచారం.