ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. తనను నమ్మిన ప్రజల కోసం ఎంతటి నిర్ణయం అయినా తీసుకునే నేతగా ఆయన మరోమారు నిరూపించుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా వైయస్సార్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో రోజు పులివెందులలో పర్యటించారు.
భాకరాపేట వద్ద కొత్తగా బస్సు డిపో, బస్ స్టేషన్ నిర్మాణంతో పాటు, నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాలను కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద ఆవిష్కరించారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. అనంతరం పులివెందుల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ ఏమంటున్నారంటే ….
పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనిదని సీఎం జగన్ అన్నారు. “దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో మరో రూ.5 వేల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నాం. ఇక్కడి ప్రజలు సొంత కొడుకులా, బిడ్డలా ఆదరిస్తున్నారు. ఏరోజూ తక్కువ చేయలేదు. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను ` అంటూ సీఎం జగన్ వెల్లడించారు. “గండికోట రిజర్వాయర్ నుంచి 40 రోజుల్లో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్), పైడిపాలెం జలాశయాలు నింపేందుకు రూ.3 వేల కోట్లతో లిఫ్ట్ ప్రాజెక్టులు చేపడుతున్నాం. ఈ నెల 26న టెండర్లు అప్ లోడ్. మార్చికల్లా పనులు మొదలు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయం దాదాపు రూ.4300 కోట్లు.“ అని సీఎం జగన్ వెల్లడించారు.
శ్రీశైలం – పోతిరెడ్డిపాడు గురించి….
‘శ్రీశైలంలో నీరు క్రమంగా తగ్గుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరు వస్తేనే మనకు నీరు. పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కులు డ్రా చేయడం (ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ) శ్రీశైలంలో 881 అడుగులు ఉంటేనే సాధ్యం అవుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి మట్టం 885 అడుగులు. ఆ ప్రాజెక్టులో నీరు 854కు పడిపోతే పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలుగుతాం.గత 15 ఏల్లలో కేవలం 25 రోజులు కూడా 881 అడుగుల నీరు లేదు’. ‘మనకు వర్షాలు తక్కువ. నీరు వచ్చినప్పుడే నిల్వ చేసుకోవాలి. మన డ్యామ్లలోకి నీరు వేగంగా చేరితేనే లాభం. అందుకే ఈ చర్యలు. శ్రీశైలం రిజర్వాయర్లో నీరు 40 రోజులు ఉంటే, మన డ్యామ్లు నిండుతాయి. అందుకే ఆ దిశగా ఇవాళ అడుగులు వేస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలలు. ఈ సమయంలోనే ఫలానాది చేయగలుగుతాము అని చేసి చూపించాము. మనసు పెడితే, చిత్తశుద్ది ఉంటే రైతులకు ఎలా మేలు చేయవచ్చన్నది చేసి చూపాం’ అని సీఎం జగన్ అన్నారు.