ఏపి లో చాలా మంది ఆధార్ కార్డులో తప్పులు, మార్పులు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ లో తప్పులు ఉండటంతో ఎన్నో రకాల పనులు పెండింగ్ లో పడిపోతుంటాయి. ఆధార్ సెంటర్ లకు వెళితే అక్కడ రద్దీ వల్ల పనులు సకాలంలో అవ్వక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ అప్ డేట్ చేసుకోవడానికి సరైన సెంటర్ లు సమీపంలో అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, అప్ డేట్ చేసుకునే అవకాశాన్ని గ్రామ సచివాలయాల్లో కల్పిస్తొంది. ఇవేళ 19వ తేదీ నుండి వరుసగా అయిదు రోజుల పాటు గ్రామ సచివాలయాల్లో ఆధార్ అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయాల్లో ఇందు కోసం ప్రత్యకే క్యాంప్ లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అయిదు రోజుల్లో ఆదార్ అప్ డేట్ చేయించుకోని వారి కోసం వచ్చే నెల ఫిబ్రవరి నెలలో 7వ తేదీ నుండి పదవ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు రెండో విడత క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాగిలి షన్ మోహన్ అన్ని జిల్లా కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్ చార్జి అధికారులు, జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జార చేశారు.
ప్రజలందరూ ఈ క్యాంపుల ద్వారా ఆధార్ సేవలు పొందేలా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ లు తగిన ప్రచారం చేయాలని సూచించారు. ప్రత్యేక క్యాంపుల రోజుల్లో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు పూర్తిగా అధార్ సేవల పైనే దృష్టి పెడతారు. ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం పదేళ్లలో కనీసం ఒక సారి బయోమెట్రిక్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలి. ఇలా అప్ డేట్ చేసుకోని వారు రాష్ట్రంలో ఇంకా 80వేల వరకూ ఉన్నట్లు అధికారుల అంచనా. ఇప్పుడు వీరందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ప్రత్యేక సెంటర్ లలో అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.