CMRF Scam: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును వేగవంతంగా చేసింది. ఏపి సచివాలయంలోని కొందరి ఉద్యోగుల పాత్రను ఏసిబీ గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో రూ.117 కోట్లు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఏసీబీ అధికారులు గతంలోనే గుర్తించారు. దీనిపై గత ఏడాది సెప్టెంబర్ లో కేసు నమోదు అయ్యింది. ఈ కుంభకోణంలో మరికొందరి పాత్ర ఉన్నట్లు తాజాగా ఆసుపత్రుల నుండి సేకరించిన సమాచారంతో గుర్తించారు.
2014 నుండి సిఎంఆర్ఎఫ్ లో అక్రమాలు జరిగినట్లు ప్రాధమిక దర్యాప్తులో ఏసీబీ గుర్తించింది. తప్పుడు పేర్లు, పత్రాలతో సీఎంఆర్ఎఫ్ నిధులను కైంకర్యం చేసినట్లు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ లో అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదుతో రంగంలో దిగి విచారణ చేపట్టిన ఏసీబీ నేడు నలుగురు నిందితులను అరెస్టు చేసింది. సీఎంఆర్ఎఫ్ లో సబార్డినేట్లుగా పని చేస్తున్న చదలవాడ సుబ్రమణ్యం, సోకా రమేష్, ఓ ప్రజా ప్రజా ప్రతినిధి వద్ద ప్రైవేటు పిఏగా పని చేసిన ధనరాజ్ అలియాస్ నాని, ఒంగోలుకు చెందిన మురళీకృష్ణలను అరెస్టు చేశారు.
సీఎంఆర్ఎఫ్ లాగిన్ ఐడీ, పాస్ వర్డులను సేకరించి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు క్లైయిమ్స్ తో నిధులు గోల్ మాల్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. 2014 నుండి ఓ ప్రజా ప్రతినిధి వద్ద ప్రైవేట్ సెక్రటరీగా పని చేస్తూ ధనరాజ్ అలియాస్ నాని అనే వ్యక్తి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించింది ఏసీబీ. ఇప్పటి వరకూ 88 ఫైళ్లలో అక్రమాలు జరిగినట్లు, కోటి రూపాయలకు పైగా అక్రమ లావాదేవీలు బ్యాంకు అకౌంట్ల ద్వారా జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్ మాల్ జరిగినట్లు ప్రాధమిక దర్యాప్తులో ఏసీబీ దృవీకరించింది.