ACB Trap: అవినీతి రహిత పాలన అందించాలనీ, ఏ స్థాయిలోనూ అవినీతి ఉపేక్షించేంది లేదని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పదేపదే చెబుతున్నా పలు శాఖల్లోని కొందరు అధికారులు ఆ అలవాటు మానలేకపోతున్నారు. లంచం తీసుకోకుండా ఏ పని చేయడం లేదు. ఇటీవల కాలంలో లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారులు ఏసిబీ అధికారులకు దొరికిపోతున్నారు. అయినప్పటికీ అధికారులు ఏ మాత్రం భయం లేకుండా లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా గురువారం విశాఖ జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అయితే ఈ అధికారులు రైతుల నుండి ఎంత మొత్తం లంచం అడిగారో తెలిసి ఏసీబీ అధికారులే అవాక్కు అయ్యారు.
చోడవరం మండలం గాంధీ గ్రామానికి చెందిన చలపతిశెట్టి, వెంకట కృష్ణ నర్సాపురంలో 1.66 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూ మార్పిడి చేసేందుకు గత నెల రోజులుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పని కావడం లేదు. చివరకు ఈ పని చేయడానికి తహశీల్దార్ రవి కుమార్ ఏకంగా రూ.20 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేని బాధితుడు చెప్పగా చివరకు రూ.4లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే విధంగా నర్సీపేటలోని 50 సెంట్ల భూనిని కన్వర్షన్ చేసేందుకు డిప్యూటి తహశీల్దార్ రాజా సెంటు కు రూ.వెయ్యి చొప్పున రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు ఇద్దరు ఏసిబీ అధికారులను ఆశ్రయించారు.
Read More: Revenue Mistakes: రెవెన్యూ లీలలకు ఇదో మచ్చుతునక..! కనబడుతున్నాయా జగన్ సారూ..!!
ఇక ఏసీబీ అధికారుల సూచనల మేరకు వారి సమక్షంలోనే బాధితులు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేశారు. డబ్బులు సిద్ధం చేశామనీ, ఎక్కడకు తీసుకురావాలో చెప్పాలని తహశీల్దార్ రవికుమార్, డిప్యూటి తహశీల్దార్ రాజాకు ఫోన్ చేశాడు. కార్యాలయానికి రావద్దని, తమ కారు డ్రైవర్ కు డబ్బులు ఇవ్వాలని సూచించారు. బాధితులు నగదును కారు డ్రైవర్ కు డబ్బులు ఇచ్చి పక్కకు వెళ్లిపోయారు. తరువాత కారు డ్రైవర్ నుండి తహశీల్దార్, డిప్యూటి తహశీల్దార్ డబ్బులు తీసుకుంటుండగా అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అనంతరం వారి వద్ద నుండి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.