Acchennaidu: రాజకీయ నాయకులు పబ్లిక్ ప్లేస్లో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. పార్టీలో ప్రధాన నాయకులు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. వారు ఏది తప్పుగా మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది వారికి ఇబ్బంది కల్గిస్తుంది. ప్రత్యర్ధులు దాన్ని అస్త్రంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గతంలో ఒక సారి ఇలానే మాట్లాడి దొరికిపోయారు. దాంతో ఆయనకు నోటి దురద ఎక్కువ అని విమర్శలు వచ్చాయి. ఇలా మాట్లాడే వాళ్లను శ్రీకాకుళం జిల్లాలో నోటి దూల అంటుంటారు. వైసీపీ వాళ్లు ఇప్పటి కూడా టీడీపీని విమర్శించాలి అంటే “పార్టీ లేదు – బొక్కా లేదు” అని అంటుంటారు. ఎందుకంటే గతంలో అచ్చెన్నాయుడే పార్టీని ఇలా అంటూ ఓ వీడియోలో దొరికపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియా చాలా స్పీడ్ గా ఉంది. ఏ వీడియో అయినా క్షణాల్లో వైరల్ అవ్వడంతో కోట్ల మందికి వెళ్లిపోతోంది. అలానే అచ్చెన్నాయుడు నిన్న కూడా ఒక వీడియోలో దొరికారు. ఇంతకు ముందు మాట్లాడింది పార్టీ గురించి. అది వేరు. నిన్న ఆయన ఒక నాయకుడు (వ్యక్తి) గురించి కామెంట్ చేశారు. ఆ వ్యక్తి చెక్కు ఇచ్చారంట, చెక్కు కాదు ఆస్తి మొత్తం ఇచ్చినా పార్టీ అతన్ని పట్టించుకోదు, టికెట్ ఇవ్వదు అని కామెంట్స్ చేశారు. టీడీపీ వైఖరిని విమర్శించడానికి వైసీపీ ఇది ఒక ఆయుధంగా తయారు అయ్యింది.
Read More: YS Jagan: కేసిఆర్ కి జగన్, పవార్, థాక్రే వరుస షాక్ లు..! భయమా – వ్యూహమా..!?
Acchennaidu: పాతపట్నం నియోజకవర్గంలో..
విషయంలోకి వెళితే…పాతపట్నం నియోజకవర్గంలోని ఏంజీఆర్ (మామిడి గోవిందరావు) అనే వ్యక్తి టీడీపీ అభ్యర్ధిత్వం ఆశిస్తున్నారు. ఎంజీఆర్ కు పాతపట్నం నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. ఆయన రకరకరాల సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజల్లో ఉంటున్నారు. మొదటి నుండి తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. మొదటి నుండి టీడీపీకి సర్వీస్ చేస్తున్నారు. ఆయనకు అంటూ పెద్ద అనుచరగణం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయాలన్నది ఎంజిఆర్ లక్ష్యం. అక్కడ కలమట వెంకట రమణ మాజీ ఎమ్మెల్యే. 2014 లో వైసీపీ తరపున గెలిచి తరువాత టీడీపీలోకి వచ్చారు. 2019లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. కలమట వెంకట రమణ తన తండ్రి కలమట మోహనరావు బ్రాండ్ ఇమేజ్ తో రాజకీయాల్లోకి వచ్చారు. మోహనరావు అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయం వేరుగా ఉండేది. అయితే వెంకట రమణ వ్యవహార శైలి కారణంగా క్యాడర్ ఇప్పుడిప్పుడే చేజారిపోతోంది. ఆయనపై గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు కలమట వెంకట రమణకు టికెట్ ఇవ్వాలా లేక ఎంజీఆర్ కు టికెట్ ఇవ్వాలా అన్న దానిపై టీడీపీ అయోమయంలో ఉంది. ఎంజీఆర్ వైపే పార్టీ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
Acchennaidu: చెక్కు కాదు కదా ఆయన ఆస్తి మొత్తం రాసి ఇచ్చినా..
ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ నిన్న అచ్చెన్నాయుడును కలిశారు. ఆయన (ఎంజిఆర్) అలా కలస్తున్నాడు, ఇలా కలుస్తున్నాడు, టికెట్ తనదే అని ప్రచారం చేసుకుంటున్నారు అని ఫిర్యాదు మాదిరిగా చెప్పాడు. అయితే అచ్చెన్నాయుడు దానిపై ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో హుందాగా ఇది తర్వాత మాట్లాడదాం, టికెట్ల కేటాయింపు పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. పార్టీ ఆఫీసులో తరువాత మాట్లాడదాం అని చెప్పాలి. లేదా మీరు జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. టికెట్ ఎవరికి ఇచ్చినా జాగ్రత్తగా పార్టీ కోసం పని చేయండి అని చెప్పాలి. లేదా టికెట్ నీదే జాగ్రత్తగా పని చేసుకో అని చెప్పాలి. అలా కాకుండా “నేను పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు వాడు వచ్చాడు. చంద్రబాబు నాయుడికి ఏదో చెక్కు ఇచ్చాడు. చెక్కు కాదు కదా ఆయన ఆస్తి మొత్తం రాసి ఇచ్చినా కూడా పార్టీ ఆయన్ను వాడుకుంటుంది. వాడుకుని వదిలేస్తుంది” అని అచ్చెన్నాయుడు అన్నారు. ఇది ఒక నాయకుడికి ఎంతో బాధ కల్గిస్తుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా మొత్తం అచ్చెన్నాయడు మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. తరువాత ఇది రాష్ట్రం మొత్తం కూడా వైరల్ అవుతుంది.
పార్టీకే తలవొంపులు తెచ్చేలా
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఆలా మాట్లాడటం కరెక్టు కాదు అని పార్టీ నేతలే అంటున్నారు. అచ్చెన్నాయుడు ఇలా మాట్లాడటం వల్ల పార్టీకి నష్టమని కూడా అంటున్నారు. వాస్తవానికి అచ్చెన్నాయుడు పార్టీకి కమిటెడ్ నాయకుడు, విషయ పరిజ్ఞానం ఉంది. పార్టీలోనూ, ప్రజల్లోనూ మంచి పేరు ఉంది. పార్టీని డీల్ చేస్తున్నారు. కానీ విషయాన్ని డీల్ చేయడంలో, విషయాన్ని అప్పటికప్పుడు పక్కన బెట్టడంలో సర్దిచెప్పడంలో ఆయన ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏది పడితే ఆది మాట్లాడేసి పార్టీకే తలవొంపులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతల్లో నలుగుతున్న టాక్.