ప్రముఖ హాస్య నటుడు ఆలీ ని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సీఎం జగన్మోహనరెడ్డికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు ఆలీ. ఈ పదవి తన కుమార్తె పెళ్లి వేడుకకు సీఎం జగన్ ఇచ్చిన బహుమతిగా ఆలీ పేర్కొన్నారు. అయితే తాజాగా ఆలీ తన భార్యతో ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని వైఎస్ జగన్ ను నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆలీ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులైన తర్వాత మొదటి సారి సీఎం వైఎస్ జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే సందర్భంగా తన కుమార్తె వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను సీఎం జగన్ కు ఆలీ దంపతులు ఇవ్వగా, తప్పకుండా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తొంది. కాగా గత ఎన్నికల ముందు టీడీపీ వీడి వైసీపీలో చేరిన హాస్య నటుడు ఆలీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలీకి మంచి పదవి లభిస్తుందని అందరూ భావించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని రెండు మూడు పర్యాయాలు ఆలీ కలిసి వెళ్లారు. ఆ సమయంలోనే తనకు సీఎం జగన్ హామీ ఇచ్చారనీ, త్వరలో తనకు కబురు వస్తుందని చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ అనీ, ఆ తర్వాత వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అని, రాజ్యసభ పదవి అంటూ ప్రచారం జరిగింది. అయితే తనకు ఫలానా పదవి కావాలని ఆశించలేదనీ, ఫలానా పదవి ఇస్తానని సీఎం హామీ ఇవ్వలేదనీ, ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పారు అలీ. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆలీకి కూడా ప్రభుత్వ సలహాదారు పోస్టును కట్టబెట్టారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి.
AP High Court: మళ్లీ హైకోర్టుకు చేరిన రైతుల పాదయాత్ర పంచాయతీ.. నిరసనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు