YS Jagan: ప్రముఖ సినీ హాస్య నటుడు ఆలీకి ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నామినేటెడ్ పోస్టు ఖాయం చేసినట్లుగా కనబడుతోంది. ఇటీవలే సినీ పరిశ్రమ సమస్యలపై చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులతో కలిసి సీఎం జగన్ తో ఆలీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం అనంతరం ఆలీతో వారం తరువాత కలుద్దాం అని జగన్ అనడంతో త్వరలో ఆలీకి రాజ్యసభ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. వారం తిరగకముందే ఆలీ మంగళవారం కుటుంబ సమేతంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆనంతరం ఆలీ మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ సీటు ఇస్తారనే విషయం తనకు తెలియదనీ, అలాంటి సంకేతాలు ఏవీ సీఎం ఇవ్వలేదని చెప్పారు. అయితే అతి త్వరలో పార్టీ కార్యాలయం నుండి అధికారికంగా ఒక ప్రకటన ఉందని మాత్రం ఆలీ పేర్కొన్నారు. దీంతో ఆలీకి రాజ్యసభ ఇస్తారా లేక ఇంకేదైనా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవికి సంబంధించి ప్రకటన వెలువడుతుందా అనేది వేచి చూడాలి.
YS Jagan: మర్యాదపూర్వకంగానే
అయితే ఆలీ మాత్రం సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ సీఎం కాకముందు నుండే వారి కుటుంబంతో తనకు పరిచయం ఉందనీ, 2004 లో వైఎస్ఆర్ పాదయాత్ర చేసిన తర్వాత కలిసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు ఆలీ. పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తాననీ తాను అనలేదనీ, గత సాధారణ ఎన్నికల సందర్భంలోనే తనకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారనీ సమయం లేక తానే వద్దని చెప్పానన్నారు. సీఎంఒ నుండి తనకు పిలుపు రావడంతో నేడు కుటుంబ సమేతంగా వచ్చి సీఎం జగన్ ను కలిసినట్లు చెప్పారు ఆలీ. కార్యాలయంలో పలువురు మంత్రులు, ప్రచార సమయంలో కలిసి పని చేసిన ఎమ్మెల్యేలను ఈ రోజు కలవడం జరిగిందన్నారు. పదవి రానందువల్ల తనకు అసంతృప్తి ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదన్నారు.
YS Jagan: ఆ ప్రచారంలో వాస్తవం లేదు
ఇటీవల సినీ ప్రముఖులను పిలిచి సీఎం జగన్మోహనరెడ్డి అవమానించారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. చిరంజీవి వచ్చినప్పుడు సీఎం జగన్ చాలా గౌరవంగా చూశారన్నారు. ఏపిలో సినిమా టికెట్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలన్నీ సీఎం జగన్ కు వివరించామనీ, త్వరలో సినిమా కష్టాలు తీరుతాయని అన్నారు ఆలీ.