Rahul Gandhi: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ త్వరలో ఏపికి రానున్నారు. ఏపి ప్రస్తుతం ఒక పక్క అమరావతిలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మరో పక్క విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళనల నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. నవ్యాంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం అనేది లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారిలో అత్యధికులు వైసీపీ లోకి వెళ్లడంతో ఆ పార్టీ క్యాడర్ కూడా వైసీపీకి మళ్లింది.
ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ నాయకత్వం యోచన చేస్తుంది. ఈ క్రమంలో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (పీసీసీ) అధ్యక్షుడి మార్పునకు చర్యలు తీసుకోనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంకు నైతిక బాధ్యత వహించి రఘువీరారెడ్డి తన పదవికి రాజీనామా చేయగా ఏఐసీసీ ఆయన స్థానంలో సాకే శైలజానాధ్ ను పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే శైలజానాధ్ బాధ్యతలు అప్పగించిన తరువాత కూడా పార్టీ కార్యక్రమాలు ఊపందుకోలేదు.
Rahul Gandhi: పీసీసీకి కిరణ్ కుమార్ రెడ్డి విముఖత
ఈ నేపథ్యంలో తెలంగాణలో మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం ఉండి వాగ్దాటి ఉన్న గట్టి నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ యోచన చేస్తున్నది. ఈ క్రమంలో భాగం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కి పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ హైకమాండ్ యోచన చేయగా ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే రెడ్డి లేదా కాపు సామాజిక వర్గ నేతకు పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు పార్టీలో సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
విశాఖ, అమరావతికి రాహుల్ గాంధీ
ఈ తరుణంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్న రాహుల్ గాంధీ త్వరలో రాష్ట్రానికి వస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. రాహుల్ గాంధీ అమరావతిలో రైతుల ఉద్యమానికి, విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి మద్దతు పలుకుతారని చెప్పారు. మూడు రాజధానులపై జగన్ తొందరపాటు చర్య తీసుకున్నారని చింతా మోహన్ అన్నారు. దేశానికి రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని ఆశాభావం వ్యక్తం చేసిన చింతా మోహన్ రాష్ట్రంలో త్వరలో పీసీసీలో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. తాను మాత్రం పీసీసీ రేసులో లేనని స్పష్టం చేశారు.