హైదరాబాద్ హఫీజ్పేట్ భూ వివాదం… తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అడ్డంగా ఇరుక్కుపోవడం, ఊహించని విధంగా జైలు పాలవడం , ఉత్కంఠ అనంతరం బెయిల్ దొరకడంతో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పార్టీ పగ్గాలకు ఆమె గుడ్ బై చెప్తారని అంటున్నారు.
అడ్డంగా ఇరుక్కుపోయిన ఫ్యామిలీ?
అఖిలప్రియతో పాటుగా ఆమె భర్త భార్గవ రామ్, సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి పేర్లు కూడా ఈ కేసులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అఖిల ప్రియకు మాత్రమే బెయిల్ దొరికింది. ఆమె భర్త, సోదరులకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీరికి బెయిల్ పై సందిగ్ధత కొనసాగుతోంది. కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్ తర్వాత భూమా వర్గీయులు ఆందోళనలో ఉన్నారు. దానికి కారణం నియోజకవర్గంలో తమకు అండా దండా ఉండటం గురించి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి.
భూమా ఇంట ఏం జరుగుతోంది ?
భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత వారసురాలిగా అఖిలప్రియ బాధ్యతలు తీసుకున్నారు. అయితే , తాజాగా కిడ్నాప్ ఈ వివాదంలో అఖిలప్రియ నిండా మునిగిపోవడంతో ఇంచార్జీగా ఎవరుంటారనే చర్చ జరుగుతోంది. భూమా తనయుడు జగత్ విఖ్యాత్రెడ్డి పేరు తెరమీదకు వస్తున్నప్పటికీ వయసు రీత్యా ఇంకా అనుభవం అవసరమనే అభిప్రాయం భూమా వర్గాల్లోనే ఉందట. దీంతో, అఖిలప్రియ సోదరి మౌనిక పేరు తెరమీదకు వస్తోంది. కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టయిన తర్వాత కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ కార్యకర్తలతో భూమా మౌనిక సమావేశం నిర్వహించారు. అఖిలప్రియకు బెయిల్ వచ్చాక భారీ ర్యాలీతో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు తీసుకొస్తామని చెప్పారు. అప్పటి వరకు భూమా కుటుంబం నుంచి తాను బాధ్యత తీసుకుని.. కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటానని భూమ మౌనిక తెలిపారు.
మౌనిక ను వారసురాలిగా ప్రకటిస్తారా?
2017 నంద్యాల ఉపఎన్నికలో మౌనిక జనాలకు పరిచయం అయ్యారు. ఆ సమయంలో ఆమె తీరుపై టీడీపీలోనూ జనాల్లోనూ ఆసక్తికర చర్చ జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లో అఖిల యాక్టివ్ కావడంతో మౌనిక సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు అక్క అరెస్ట్తో తెరమీదకు వచ్చారు. అఖిలప్రియ ను వివాదాలు చుట్టుముట్టినందున మౌనిక దూకుడుగా ఉంటారని చెప్తున్నారు. అయితే, కార్యకర్తల సమావేశంలో భూమా కుటుంబం తరఫున అండగా ఉంటానని మాత్రమే చెప్పారు కానీ.. తాను యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తానని మౌనిక ఎక్కడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా మౌనిక బాధ్యతలు వహిస్తాని అఖిలప్రియ ప్రకటిస్తారా? అనే సందేహం వ్యక్తం అవుతోంది.