శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ తమ్మినేని సీతారామ్ కు నియోజక వర్గ వైసీపీలో కొత్త తలనొప్పులు ప్రారంభం అయ్యాయి అని అంటున్నారు. నియోజకవర్గంలో సువ్వారి గాంధీ రూపంలో వైసీపీలోనే వ్యతిరేక గ్రూపు పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయనకు షాక్ ఇస్తున్నారు. రీసెంట్ గా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జన్మదినోత్సవ వేడుకల సందర్భంలోనూ పార్టీలో అంతర్గత విభేదాలు మరో సారి బహిర్గతం అయ్యాయి. ఆముదాలవలస నియోజకవర్గ కేంద్రంలోని జూనియర్ కళాశాలలో అధికారికంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జన్నదిన వేడుకలను నిర్వహించగా, ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, గ్రామ సచివాలయాల సిబ్బంది, నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన కొంత మంది నాయకులు మాత్రమే హజరైయ్యారనీ, మెజార్టీ పార్టీ శ్రేణులు, నాయకులు ఇక్కడి కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
సువ్వారి గాంధీ హాట్ కామెంట్స్
ఇదే క్రమంలో గత ఎన్నికల సమయంలోనే అసెంబ్లీ టికెట్ ఆశించిన నియోజకవర్గ వైసీపీ నేత సువ్వారి గాంధీ ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మండలాల్లో భారీ ర్యాలీలు నిర్వహించడం, వేలాది మందితో ఆముదాలవలసలో కార్యక్రమాన్ని నిర్వహించడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే..వైఎస్ జన్మదినోత్సవ వేడకల సభలో సువ్వారి గాంధీ చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. రాజకీయాలు అంటే వడ్డీ వ్యాపారం కాదనీ, సొంత లాభాల కోసం నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలను నట్టేట ముంచి ఆస్తులు కూడబెట్టుకునే పద్దతి కానేకాదని సువ్వారి ఆరోపణలు చేశారు. అవినీతి, బంధుప్రీతి, కమీషన్ల కక్కుర్తి, కలెక్షన్లు, వెన్నుపోటు రాజకీయాలను రూపు మాపుతానని ఆయన కామెంట్స్ చేయడం పరోక్షంగా తమ్మినేనిని ఉద్దేశించి చేసినవే అని బాహాటంగా చర్చించుకుంటున్నారు. పార్టీలో ముఖ్యమైన నేతల అండదండలు, మద్దతు ఉండటం వల్లనే సువ్వారి గాంధీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారనీ, ఆ క్రమంలోనే భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్న టాక్ కూడా నియోజకవర్గంలో నడుస్తొంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులతో సువ్వారికి మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు.
సువ్వారి గాంధీకి తోడు తమ్మినేని సీతారామ్ కి సంబంధం లేకుండా మరో రెండు గ్రూపులు కూడా సీఎం జగన్మోహనరెడ్డి జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. వైసీపీ నాయకుడు చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో ఒక గ్రూపు బొడ్డేపల్లిపేటలో, ఆముదాలవలసకు చెందిన నేత కోట గోవిందరావు తనయుడు జశ్వంత్ రైతు బజారు వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఉన్నప్పటికీ ఆయనకు సంబంధం లేకుండా వేరువేరు గ్రూపులు కార్యక్రమాలను నిర్వహించడం తమ్మినేని వర్గీయులను ఆందోళనకు గురి చేస్తొందని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో సువ్వారి గాంధీ తనకు పోటీ అవుతారని భావించి సీతారామ్ అనేక విధాలుగా అణగదొక్కాలని ప్రయత్నాలు కూడా చేశారని గాంధీ వర్గాయులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ సువ్వారి గాంధీ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని కూడగట్టకున్నారని అంటున్నారు.
శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా..?
అయితే ఏం జరిగినా తమ్మినేని బలమైన ముద్ర.. క్యాడర్ లో పట్టు శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు సహా, ఆముదాలవలస నియోజకవర్గంలో కూడా శాశ్వతం.. అందుకే పార్టీ కూడా ఆయనకు పూర్తిగా అండగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో సువ్వారికి సీటు ఇస్తే తమ్మినేని సహకారం ఉంటుందా లేదా అనేది అనుమానమే..!ఇప్పుడు ఉన్న పరిస్థితులు చుస్తే ఉండక పోవచ్చు అని అంటున్నారు. తమ్మినేని అనుభవ రీత్యా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పంపించే అవకాశం లేకపోలేదు.. సో, ఈ సీటు చుట్టూ అనేక రాజకీయ పరిణామాలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.