Amaravathi: దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఓ పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ కు ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలు దాటి పోయింది. కానీ ఏపికి రాజధాని లేదు. అమరావతి కేంద్రంగా ప్రస్తుతం రాజధాని కొనసాగుతున్నా అది ఎంత కాలం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఏపికి రాజధాని ఏది అంటే ఠక్కున సమాధానం చెప్పే పరిస్థితి లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానిగా కార్యక్రమాలు ప్రారంభించినా ఆ తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహనరెడ్డి సర్కార్ మూడు రాజధానుల కాన్పెప్ట్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతిని పేర్కొంటూ సీఎం జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేయడం, ఆ తరువాత సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. తదుపరి గవర్నర్ ఆమోదంతో చట్టం అయ్యింది.
Amaravathi: త్వరలో నాణ్యమైన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు
అయితే అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, వివిద పార్టీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో రాజధాని తరలింపు ప్రక్రియకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇటీవల తాజాగా ప్రభుత్వం రాజధాని బిల్లులను ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ సారి ఎటువంటి లోపాలు లేకుండా నాణ్యమైన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకువస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆ బిల్లులను ఉపసంహరించుకున్నప్పటికీ హైకోర్టులో ఈ కేసులను కొనసాగించాలా వద్దా అనే దానిపై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఏపి రాజధాని అంశం ఇప్పట్లో తెమిలేలా కనబడటం లేదు. ఇదే కన్ఫూజన్ ఆర్బీఐకి వచ్చింది.
Amaravathi: రాజధాని ఎక్కడో ప్రభుత్వం తేల్చిన తర్వాతే
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఆర్ బీ ఐ డిప్యూటి మేనేజర్ ఎంకే సుభాశ్రీ పేర్కొన్నారు. ఏపిలో రిజర్వు బ్యాంకు కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ గత ఏడాది అక్టోబర్ 12న అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు ఆర్బీఐకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన ఆర్బీఐ పై విధంగా సమాధానం ఇచ్చింది.