Chalo Delhi: అమరావతి రాజధాని ప్రాంత రైతులు మరో సారి ఢిల్లీ బాటపట్టారు. ఏపి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రక్రియ గురించి మాట్లాడినప్పటి నుండి అమరావతి ప్రాంత రైతులు జేఏసీగా ఏర్పడి నిరసనలు, ఆందోళనలు చేసిన సంగతి తెలిసింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వం మాత్రం మొదటి నుండి మూడు రాజధానులకే కట్టుబడి ఉంది. ఇదే విషయాన్ని మంత్రులు, ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. ఇటీవల హైకోర్టు సీఆర్డీఏ ఒప్పందాల ప్రకారం అమరావతిలోనే రాజధాని అభివృద్ధి పనులు కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అమరావతిలో నెల రోజుల్లో మౌళిక వసతులు కల్పించాలనీ, మూడు నెలల్లోనే అభివృద్ధి చేసిన స్థలాలు రైతులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
Chalo Delhi: హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంతో..
అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం వద్ద రాజధాని అభివృద్ధి పనులకు నిధులు లేవనీ, రాష్ట్ర ప్రభుత్వానికి మరింత సమయం కావాలంటూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ప్రభుత్వం మూడు రాజధానులే మా విధంగా అంటూ ప్రకటనలు చేయడంతో అమరావతి రైతు జేఏసీ ‘బిల్డ్ అమరావతి – సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో భాగంగా అమరావతి రైతులు కాలయాపన చేయకుండా ప్రభుత్వం అమరావతిలో రాజధాని అభివృద్ధి పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. అరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గతంలో అమరావతి రైతు జేఏసి నేతలు ఢిల్లీకి వెళ్లి నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు కేంద్రంలోని పలువురు పెద్దలను కలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సారి రైతులు ‘బిల్డ్ అమరావతి – సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ఢిల్లీ బాటపట్టారు.ఈ రోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి అమరావతి రైతులు ఢిల్లీ బయలుదేరారు.