అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన మహాయాత్ర రెండవ రోజు మంగళగిరి నుండి దుగ్గిరాల వరకూ కొనసాగింది. తొలుత మంగళగిరిలోని లక్ష్మీనర్శింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు.. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం మనసు మారాలని వేడుకున్నారు. అనంతరం మంగళగిరి మెయిన్ రోడ్డు మీదుగా సాగి ఆత్మకూరు, ఆ తర్వాత పెదవడ్లపూడి వరకూ సాగింది. పెదవడ్లపూడి గ్రామం దాటిన తర్వాత భోజన విరామం తీసుకున్న రైతులు మధ్యాహ్నం అక్కడ నుండి పాదయాత్ర కొనసాగించారు.
దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో రైతులకు వినూత్నంగా స్వాగతం పలికారు. కృష్ణాకాలువలో పడవలతో ఆహ్వానం పలికారు. పడవలపై ఫ్లెక్సీలు, బెలూన్లు ప్రదర్శించి స్వాగతం పలికారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు పండ్లు, మజ్జిగ ను గ్రామస్తులు అందజేశారు. ఆట పాటలు, డప్పువాయిద్యాల, నృత్యాల నడుమ పాదయాత్ర రేవేంద్రపాడు తుమ్మలపూడి, చిలువూరు, మంచికలపూడి మీదుగా దుగ్గిరాలకు చేరుకుంది. రెండవ రోజు పాదయాత్ర 18 కిలో మీటర్లు సాగింది. రేపు (బుధవారం) దుగ్గిరాల నుండి పాదయాత్ర చింతలపూడి, ఎరుకలపూడి, తెనాలి మీదుగా పెదరావూరు వరకూ సాగనుంది. పాదయాత్ర చేస్తున్న రైతులకు ఆయా గ్రామాల్లో రైతులు సంఘీభావం తెలిపారు. అమరావతి నుండి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర అరసవెల్లి వరకూ సాగనుంది. మరో పక్క ఈ పాదయాత్రపై వైసీపీ నేతలు, మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్రపై దండయాత్రగా అభివర్ణిస్తున్నారు.
రాష్ట్ర విభజన సమస్యలపై 27న కీలక భేటీ .. కేంద్ర హోంశాఖ రూపొందిన అజండా ఇది.. ట్విస్ట్ ఏమిటంటే..?