మహా పాదయాత్రపై అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ తాత్కాలికంగా యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల తీరును కోర్టు దృష్టికి తీసుకువెళతామని, కోర్టు తీర్పు తర్వాత యాత్రను కొనసాగిస్తామని వెల్లడించారు. కోర్టు సెలవుల నేపథ్యంలో మహా పాదయాత్రకు నాలుగు రోజులు విరామం ప్రకటించినట్లు అమరావతి రైతుల జేఏసి ప్రకటించింది. అమరావతి రైతులు తలపెట్టిన పాదయాత్ర 41వ రోజుకు చేరుకుంది. నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం బైపాస్ రోడ్డు నుండి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.
రైతులు బస చేసిన విజయ ఫంక్షన్ హాలు వద్దకు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. రైతులకు కలిసి మద్దతు తెలిపేందుకు బయట నుండి వచ్చే వారిని సైతం అనుమతించలేదు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పాదయాత్రలో పాల్గొనే 600 మంది గుర్తింపు కార్డులు చూపించాలని, అనుమతి ఉన్న వాహనాలు కాకుండా మిగతావి అంగీకరించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంలో రైతులు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అమరావతి రైతు జేఏసీ నేతలు సమావేశమై పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్ర ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పాదయాత్రకు తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించామనీ, తదుపరి కార్యాచరణ చర్చించి ప్రకటిస్తామని తెలిపారు. పాదయాత్రలో ఎదురవుతున్న అడ్డంకులను న్యాయస్థానానికి వివరించి కోర్టు మార్గదర్శకాలతో అరసవల్లి వరకు పాదయాత్ర కొనసాగిస్తామని జేఏసి నేతలు వెల్లడించారు.
కాగా ఈ పరిణామంపై టీడీపీ స్పందించింది. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అమరావతి రైతులు ఉన్న విజయ ఫంక్షన్ హాల్ చుట్టూ పోలీసులు ఎలా మోహరించారో చూడండి. అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది టీడీపీ. రైతుల పాదయాత్ర విషయంలో జగన్ రెడ్డి భయానికి, కుట్రకి ఇది నిదర్శనమని విమర్శించింది. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపైన, మీడియా పైన కూడా ఆంక్షలు పెట్టారని టీడీపీ పేర్కొంది.
అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక ఆదేశాలు
కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అమరావతి రైతులు ఉన్న విజయ ఫంక్షన్ హాల్ చుట్టూ పోలీసులు ఎలా మోహరించారో చూడండి. రైతుల పాదయాత్ర విషయంలో జగన్ రెడ్డి భయానికి, కుట్రకి ఇది నిదర్శనం. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపైన, మీడియా పైన కూడా ఆంక్షలు పెట్టారు.#AmaravatiFarmersMarch2022 pic.twitter.com/mOAQb8iCOq
— Telugu Desam Party (@JaiTDP) October 22, 2022