Amaravati JAC: అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఉద్యమం రేపటికి 800వ రోజుకు చేరుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మెరుగైన బిల్లు తీసుకువస్తామని చెప్పడం, విశాఖను పరిపాలనా రాజధాని చేయడం ఖాయమని మంత్రులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అమరావతి జేఏసి ఆధ్వర్యంలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
Amaravati JAC: రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా
అమరావతి ఉద్యమం చేపట్టి 800 రోజులు అవుతున్న నేపథ్యంలో అమరావతి జేఏసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. త్వరలో అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చే క్రమంలో ముందుకు వెళ్లనున్నామని అమరావతి జేఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు తెలిపారు. మార్చి నెల నుండి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి జేఏసీల ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు చేపడతామని చెప్పారు. శ్రీకాకుళం నుండి ఉత్తరాంధ్ర కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు తమకు మద్దతు తెలుపుతున్నాయన్నారు.
Amaravati JAC: రౌండ్ టేబుల్ సమావేశాలు
ఉభయ గోదావరి పరిధిలోని ఏలూరు, అమలాపురం, రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తి చేస్తామన్నారు. ఈ నెలాఖరుకల్లా ఉభయగోదావరి జిల్లాల్లో అమరావతి జేఏసిల ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తి చేస్తామని అమరావతి జేఏసి కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కేంద్రాల్లో అమరావతి జేఏసిల ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 800 రోజులుగా రోడ్డునపడి పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.