Amith Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆయనకు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షాతో కలిసి సీఎం జగన్.. తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుమల బయలుదేరి వెళ్లారు. స్వామి వారి దర్శనం అనంతరం అమిత్ షా తిరుపతి తాజ్ హోటల్ లో బస చేయనున్నారు.
రేపు ఉదయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు చెందిన స్వర్ణభారతి ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొననున్నారు. రేపు సాయంత్రం తాజ్ హోటల్ నందు అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపి, కర్నాటక ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ముఖ్యమంత్రుల ప్రతినిధులు పాల్గొంటారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తిరుమలలో అమిత్ షాకు స్వామివారి దర్శనం చేయించిన అనంతరం రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరతారు. రేపు (ఆదివారం) మద్యాహ్నం 1.30 గంటలకు సీఎం జగన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుండి తిరుపతి బయలుదేరతారు. మధ్యాహ్నం 3 గంటలకు తాజ్ హోటల్ జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటారు.
కాగా రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.