Anandaiah Medicine: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా మందు వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ మారింది. ఈ నెల 17వ తేదీ నుండి కరోనా మందు పంపిణీని లోకాయుక్త ఆదేశాలతో అధికారులు నిలుపుదల చేసినప్పటి నుండి రోజు ఏదో ఒక సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. మెడికల్ మఫీయా, కొంత మంది నాయకుల నాయకుల కబంద హస్తాల్లో ఆనందయ్య నలిగిపోతున్నారనే మాట వినబడుతోంది. ఓ పక్క ఆనందయ్య మందు పై వైద్య నిపుణులు పరిశోదనలు జరుపుతున్న క్రమంలోనే హైకోర్టులో రెండు పిటిషన్ లు దాఖలైయ్యాయి. ఆనందయ్య మందు పంపిణీని యథావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ లలో కోరారు.
ఇదే క్రమంలో ఆనందయ్య కూడా హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయడం తీవ్ర సంచలనం అయ్యింది. తన మందు విషయంలో ప్రైవేటు వ్యక్తులు ఎవరూ జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాకముందే ఆనందయ్య మందు విషయంలో నివేదికలు రావడానికి ఎన్ని రోజులు పడుతుందని ప్రభుత్వాని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ప్రజా ప్రయోజనం కోసం ఉచితంగా మందు పంపిణీ చేస్తుంటే దానిలో రాజకీయ ప్రవేశించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా ఉంటే ఆనందయ్యతో రహస్య ప్రదేశంలో వైసీపీ నాయకులు మందు తయారు చేయిస్తున్నారనీ, ఆ మందును ఆ పార్టీలోని ప్రముఖులు, పెద్దలకు, అదికారులకు పంపుతున్నారంటూ వార్తలు కూడా హాల్ చల్ చేస్తున్నాయి.
ఆనందయ్య మందు వ్యవహారానికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు జగుతున్న వ్యవహారాలను బహిర్గతం చేస్తుండటం.. ఆనందయ్య పై కార్పోరేట్ మెడికల్ మాఫీయా ఎత్తుగడలకు అడ్డుపడుతున్నట్లు అవుతోంది. లేకుంటే ఆనందయ్య మందు వ్యవహారాన్ని మెడికల్ మాఫీయా పూర్తిగా మరుగున పడేసేదే అన్నవాదనలు కూడా వినబడుతున్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆనందయ్య మందు విషయంలో సోషల్ మీడియా వల్ల మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అదే రకంగా జరుగుతోంది.
ఇవన్నీ ఇలా ఉంటే ఆనందయ్య మందు విషయంలో హైకోర్టు కొంత సీరియస్ గా పట్టించుకున్నట్లే కనబడుతోంది. ఆనందయ్య మందు ప్రజా ప్రయోజనం కోసం తయారు చేసినందున ప్రభుత్వం రెండు రోజుల్లో అంటే ఈ నెల 29లోగా ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని హైకోర్టు సూచించడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో దీని వెనుక ఏమైనా రాజకీయాలు ఉంటే చూస్తూ ఊరుకోమని కూడా ఒక హెచ్చరిక లాంటిది చురకలు అంటించింది. హైకోర్టు ఈ విధమైన సూచలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే ఆనందయ్య కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. తన మందు విషయంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఒత్తిడి చేస్తున్నారనీ తన మందు పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఆనందయ్య మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఆ క్రెటిడ్ లో కొంత భాగాన్ని వైసీపీ ప్రభుత్వం పొందాలని చూస్తుంది. అయితే ఈ మందు పంపిణీలో తటస్థ వ్యక్తి అయిన ఆనందయ్యకే మొత్తం క్రెడిట్ దక్కాలి గానీ ఇందులో వైసీపీకి, ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఓ పక్క ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి లేదని చెబుతూనే వైసీపీ నేతలు రహస్యంగా మందు తయారు చేయించి వందలాది మందికి సరఫరా చేయడాన్ని టీడీపీ తప్పుబడుతూ వాటికి సంబంధించిన ఆధారాలను చూపుతోంది. మంచి ఉద్దేశంతో ఆనందయ్య పేదలకు కరోనా మందు పంపిణీ చేస్తుంటే దాన్ని అనుమతులు లేవని అడ్డుకున్న వారే శాస్త్రీయ పరిశోధన రిపోర్టులు రాకముందే రహస్య ప్రదేశంలో మందు తయారు చేయిస్తున్నారంటూ వార్తలు రావడం, ఆయనను అధికార పార్టీ కనుసన్నల్లోనే ఉంచుకోవడం విమర్శలకు దారి తీస్తున్నది. ఏది ఎలా ఉన్న మరో రెండు మూడు రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.