Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ వ్యవహారం నెల్లూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య చిచ్చురేపింది. దీనిపై ఇరు పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో పాటు ఇప్పుడు కేసులు నమోదు వరకూ వెళ్లింది. ఈ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కృష్ణపట్నం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఆనందయ్య అనుమతి లేకుండా వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి నేతృత్వంలో ఆన్లైన్ లో మందుల అమ్మకానికి తెరలేపారని సోమిరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆనందయ్య మందుపై ఆన్ లైన్ ద్వారా అమ్మకానికి పెట్టిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. అయితే సోమిరెడ్డి వ్యాఖ్యలను ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ఖండించారు. సదరు టెక్నాలజీ సంస్థతో సంబంధం కూడా లేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా శేశ్రిత టెక్నాలజీ ఎండి నర్మదా రెడ్డి ఫిర్యాదు కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం సెక్షన్ ల కేసులు నమోదు అయ్యాయి. ఆయనపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తమ సంస్థపై సోమిరెడ్డి అసత్య ప్రచారం చేశారని శేశ్రిత టెక్నాలజీ ఎండి నర్మాదారెడ్డి ఆరోపించారు. తమ ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల ఆయనపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. సోమిరెడ్డి తమ డేటాను చోరీ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని నర్మదారెడ్డి పేర్కొన్నారు.
అయితే సోమిరెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఖండించారు. తక్షణం సోమిరెడ్డిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆనందయ్య అనుమతి లేకుండా ఆన్ లైన్ ద్వారా మందులు విక్రయించేందుకు యత్నించిన వారిపై కేసులు నమోదు చేయకుండా ఆ విషయాన్ని బయటపెట్టిన సోమిరెడ్డిపై కేసు నమోదు చేయడం ఏమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.