Anandaiah Medicine: గత కొద్ది రోజులుగా ఆనందయ్య కరోనా మందుపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరగడం, చివరకు ప్రభుత్వం, హైకోర్టు మందు పంపిణీకి గ్రీన్ ఇవ్వడం తెలిసిందే. ఆనందయ్య మందుపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో వేల సంఖ్యలో జనాలు గ్రామాలకు రావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరగడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా కరోనా సమీక్షా సమావేశంలో ఆనందయ్య మందు పంపిణీపై చర్చించడం జరిగింది.
దీంతో ఆనందయ్య తన మందు పంపిణీలో ప్రభుత్వ సహకారం లభిస్తుందనీ, రాష్ట్ర వ్యాప్తంగా మందు పంపిణీ చేయవచ్చని భావించారు. అయితే ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి అయితే ఇచ్చింది కానీ మందు తయారీకి అవసరమైన సహకారం అందించలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నంకు రావొద్దని సూచించారు. స్థానికులకు కృష్ణపట్నంలో మందు పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. కొన్ని ఆటంకాల వల్ల ఔషద పంపిణీ సవ్యంగా సాగడం లేదని చెప్పారు. మందు పంపిణీకి వనరులు సమకూరలేదని, విద్యుత్ సౌకర్యం, ఔషద తయారీ యంత్ర సామాగ్రి లేదని చెప్పారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషదాన్ని అందిస్తామని ఆనందయ్య తెలిపారు. ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే మందు అందిస్తున్నట్లు వెల్లడించారు.
మరో పక్క సర్వేపల్లి నియోజకవర్గంలోని గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 2 నుండి 3 వేల మందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని తెలిపారు. అల్లోపతి మందులు వాడుతూనే ఈ మందు తీసుకోవాలని కాకాణి సూచించారు. రెండు రకాల మందు ప్యాకెట్ లను పంపిణీ చేస్తూ, కరోనా వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్ మందు వాడాలనీ, కోవిడ్ నివారణకు నీలం రంగు ప్యాకెట్ వాడాలని తెలిపారు. ప్రజలకు మేలు చేసేందుకే ఆనందయ్య మందు మద్దతు ఇచ్చామనీ, కేవలం సర్వేపల్లి నియోజకవర్గంతోనే ఆనందయ్య మందు పంపిణి ఆగిపోదనీ, త్వరలోనే ఇతర జిల్లాలకు మందు పంపిణీ చేస్తామని కాకాణి తెలిపారు. ఆనందయ్య కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని పేర్కొన్నారు.
Read More: Etela rajender: ఈటల బీజేపీ చేరిక ముహూర్తం ఖరారు..! ఎప్పుడు? ఎక్కడ అంటే..?
అటు చంద్రగిరి నియోజకవర్గంలో ఆనందయ్య మందు పంపిణీకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో మందు తయారీ వేగవంతంగా జరుగుతోంది. ఆనందయ్య కుమారుడు ఆధ్వర్యంలో అక్కడ మందు తయారీ జరుగుతోంది. రేపటి నుండి చంద్రగిరి నియోజకవర్గంలో మందు పంపిణీ జరిగే అవకాశాలు ఉన్నాయి.