Anandaiah medicine: కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం, హైకోర్టు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో పక్క కంటి మందు పంపిణీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మందు పంపిణీకి సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఆనందయ్య లేఖ రాశారు. ఒక్కో జిల్లాకు అయిదు వేల మందు ప్యాకెట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామనీ, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయించాలని ఆనందయ్య లేఖలో కోరారు. అదే విధంగా మందు తయారీకి అవసరమైన సామాగ్రి తదితరాలకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని, పెద్ద మొత్తంలో తయారు చేసినట్లైయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సైతం పంపిస్తామని ఆనందయ్య తెలిపారు.
కాగా ప్రస్తుతం నెల్లూరు జిల్లా సర్వేపల్లి, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ల సౌజన్యంతో పెద్ద ఎత్తున మందు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఆనందయ్య ఆధ్వర్యంలో సర్వేపల్లిలో మందు తయారీ జరుగుతుండగా, చంద్రగిరిలో ఆనందయ్య కుమారుడు ఆధ్వర్యంలో మందు తయారీ జరిగింది. సోమవారం నుండి సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం అయ్యింది. మంగళవారం నుండి మనుబోలు, పొదలకూరు మండలాల్లోని గ్రామాల్లో గ్రామ వాలంటీర్ల సహకారంతో మందు పంపిణీకి చర్యలు చేపట్టారు.
మరో పక్క ఆనందయ్య శిష్యుల పేరుతో కొందరు పలు ప్రాంతాల్లో మందు తయారీకి పూనుకోవడం వివాదాస్పదం అవుతోంది. దీనిపై ఆనందయ్య క్లారిటీ ఇచ్చారు. సర్వేపల్లి, చంద్రగిరి తప్ప ఇంకా మరెక్కడా తాము మందు తయారీ చేయడం లేదని స్పష్టం చేశారు. తన శిష్యుల పేరుతో ఎవరైనా మందు పంపిణీ చేసినా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా మందు పంపిణీ చేయాలని ఎవరైనా భావిస్తే వారు ముడి పదార్ధాలు తీసుకువస్తే కృష్ణపట్నంలోనే మందు తయారు చేసి అందిస్తానని తెలిపారు.