టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో రెండు రోజుల పర్యటన పూర్తి చేసుకున్న చంద్రబాబు ఇవేళ సామర్లకోట నుండి అనపర్తి వరకూ రోడ్ షో నిర్వహించి అనపర్తిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. ఈ రోజు జరిగే అనపర్తి బహిరంగ సభకు అనుమతి కోసం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నిన్న స్వయంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లేఖ రాయగా, చంద్రబాబు సభకు కలెక్టర్, ఎస్పీ అనుమతులు జారీ చేశారు.ఈ క్రమంలో అనపర్తిలో బహిరంగ సభ నిర్వహణకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే నిన్న తాము ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు విస్మయానికి గురైయ్యారు.
పోలీసుల చర్యలను ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. దీనిపై మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ప్రభుత్వం ఓర్వలేక ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. అనుమతులు ఇచ్చి మళ్లీ రద్దు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రోడ్ షో యధావిధిగా జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో రాజమహేంద్రవరం, జగ్గంపేట, పెద్దాపురంలో భారీ స్థాయిలో జనం చంద్రబాబు సభలకు వచ్చి నీరాజనం పలికారన్నారు. అనపర్తిలో చంద్రబాబు సభ నిర్వహించే ప్రాంతం అత్యంత రద్దీ ప్రాంతామని, అయిదువేలకు మించి ప్రజలు పట్టే అవకాశం లేనందున అనుమతులు నిరాకరిస్తున్నట్లుగా పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనపర్తి సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో నేటి సభను ఏ విధంగా నిర్వహిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
Chetan Sharma: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా .. అందుకే(నా)..!!