పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్దించింది మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలని, సెషన్స్ కోర్టులో కేసు విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే బెయిల్ రద్దుపై సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించింది. అప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. నారాయణకు అరెస్టు నుండి వారం పాటు తాత్కాలిక రక్షణ కల్పించింది.
నారాయణ విద్యాసంస్థలతో నారాయణకు సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది సిద్దార్ధ లూత్ర వాదించారు. 2014 లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేశారని కోర్టుకు వెల్లడించారు. ర్యాంకుల కోసం పేపర్ లీకేజీ చేస్తున్నారని నారాయణ విద్యాసంస్థలపై ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపతరం లీకేజీ వ్యవహారంలో అరెస్టు అయిన నారాయణకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేయగా, దాన్ని సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు నారాయణ కు బెయిల్ రద్దు చేస్తూ రిమాండ్ కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై నారాయణ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మరో పక్క రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని నారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముందుగా నారాయణ కుమార్తె ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు. ఒక్క రోజు వ్యవధిలో నారాయణ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. కూకట్ పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ లో ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుటుంబీకుల బ్యాంక్ స్టేట్ మెంట్లు పరిశీలించారు. అలాగే పలు లావాదేవీల గురించి ఆరా తీసినట్లు తెలుస్తొంది. ఇదే క్రమంలో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నారాయణపై పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ కేసుతో పాటు అమరావతి భూములకు సంబంధించి కేసులు నమోదు అయి ఉన్నాయి. ఈ కేసుల్లో భాగంగా సీఐడీ అధికారులు పలు మార్లు నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ .. ఫోర్జరీ కేసు దర్యాప్తునకు అనుమతి