Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం గురించి ఇప్పుడు విశ్లేషకులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు అభియోగాలతో ఎంపీని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలు సెలెక్షన్ల కింద ఆయన్ను అరెస్ట్ చేయడంతో రాజకీయ దుమారం రేగింది. అయితే, ఈ విషయంలో సొంత పార్టీ నేతలు ఓ రకంగా రియాక్ట్ అవుతుంటే…ప్రతిపక్ష పార్టీలు ఇంకో రకంగా మాట్లాడుతున్నాయి.
రఘురామకృష్ణంరాజు విషయంలో ఆ రాష్ట్ర ప్రముఖుల ఎంట్రీ
ఆంధ్ర రాష్ట్రంలో వింత ప్రభుత్వం… వింతైన ముఖ్యమంత్రి వున్నారు అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు ఎద్దేవా చేశారు. ఘురామ కృష్ణం రాజుపై దాడి నిర్ధారణ అయితే అది పార్లమెంట్ పై దాడిగానే పరిగణించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయన్న బీజేపీ నేత.. ఎంపీ రఘురామ కృష్ణరాజుకు తగిలిన గాయాలపై ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యుల బృందంతో నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కక్ష సాధింపు చర్యలకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు మినహాయింపు కాదని రఘురామ కృష్ణంరాజు అరెస్ట్, తర్వాత పరిణామాలు హెచ్చరికాగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
జనసేన కూడా తక్కువ తినలేదు…
రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఖండించారు. ఎంపీగా రఘురామకు ఉండే హక్కులను ప్రభుత్వం కాలరాసినట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో ఎంపీ పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు.
వైసీపీ ఏం చెప్తోందంటే…
రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపి నందిగం సురేష్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంతో రఘురామ కృష్ణంరాజు కుమ్మక్కై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని.. అతని భాష వింటే ఎంపి అని చెప్పటం కూడా సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాజద్రోహానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎందుకు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని నిప్పులు చెరిగారు. రఘురామ వెనుక కథ, కర్మ, కర్త, క్రియ అంతా చంద్రబాబే అని.. తానే ఇదంతా చేయించిన విషయాన్ని రఘురామ కృష్ణంరాజు బయటపెట్టేస్తాడేమో అన్న భయం చంద్రబాబులో కనిపిస్తోందని ఆరోపించారు. మొత్తంగా అరెస్ట్ చేసింది ysr ఎంపీని అయితే దాన్ని ఖండిస్తోంది బీజేపీ, టీడీపీ , జనసేన సహా మిగతా ప్రతిపక్షాలు కావడం ఆసక్తికరంగా మారింది.