జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికైంది. అనేక రాష్ట్రాల పోటీ మధ్య ఏపి శకటం కోనసీమ ప్రభల తీర్ధం పరేడ్ కు ఎంపిక అయ్యింది. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 17 శకటాలు ఎంపిక అయ్యాయి. సంక్రాంతి ఉత్సవం ఇతి వృత్తంగా కోనసీమలో ప్రభల తీర్ధం పేరుతో ఉన్న ఏపి శకటంకు ఈ అవకాశం దక్కించుకున్నది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ కార్యాలయం తెలిపింది.
ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లో మకర సంక్రాంతి సందర్భంగా వీటిని ప్రదర్శిస్తారనీ, సంప్రదాయానికి అద్దం పట్టే విధంగా ప్రభల తీర్థం శకటం ఉందని తెలిపింది. గ్రీన్ హరిత విప్లవానికి ఇది ఉదాహరణగా పేర్కొంది. ఏపి దేశానికి అన్నపూర్ణ, రైల్ బౌల్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించింది. రిపబ్లిక్ డే పరేడ్ కు వివిధ రాష్ట్రాల నుండి శకటాలను కేంద్రం ఎంపిక చేస్తుంది. దక్షిణ భారతదేశం నుండి ఈ సారి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు అవకాశం వచ్చింది.
ప్రభల తీర్ధం ప్రత్యేకత
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ప్రభల తీర్థం నిర్వహిస్తారు. కోనసీమ చుట్టుపక్కనున్న 90 గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలుపంచుకుంటారు. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. జగ్గన్నతోటలో గుడి గానీ, గోపురం గానీ ఉండదు. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దం నుండి జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహిస్తున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జగ్గన్నతోటలో కనుమ సందర్భంగా జరిగే ప్రభల తీర్థం భారతీయ సంస్కృతికి ప్రతీక అని ఇంతకు ముందు ఉత్సవాల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడుతూ సందేశం పంపారు.
జగ్గన్నతోట ప్రభల తీర్థం 17వ శతాబ్దం నుంచి జరగడం ఎంతో అరుదైన విషయమని మోదీ పేర్కొన్నారు. ఈ తీర్థానికి దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు రావడం ఎంతో సంతోషకరమనీ, గ్రామాల్లో నేటికీ సంస్కృతీ సంప్రదాయాలు కొనసాగుతుండడాన్ని ఆయన కొనియాడారు. ప్రభల తీర్ధం విశిష్టతపై ప్రధాని మోడీ కొనియాడిన తర్వాత ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ప్రభల తీర్ధం శకటం ఎంపిక కావడం విశేషం. రిపబ్లిక్ డే వేడుకలకు కోనసీమ ప్రభల తీర్ధం శకటం ఎంపిక కావడం పట్ల ఆ ప్రాంత ప్రజలు, రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపి ప్రభుత్వ చొరవకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
రైతే రారాజు అనే ఇతి వృత్తంతో రూపొందించిన శకటం .. ప్రభల తీర్ధం అని వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్దతో కోనసీమ ప్రభల తీర్ధం రిపబ్లిక్ డే వేడుకలకు ఎంపికైందని అన్నారు. 400 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉన్న సంస్కృతికి ప్రబల తీర్ధం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. రైతే రాజుగా పాడిపంటలతో ఎడ్లబండిలో ఉన్న రైతన్నతో రూపకల్పన చేసిన శకటం. దేశ, విదేశాంగ ప్రతినిధుల ముందు ప్రదర్శించే సదవకాశం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో లభించిందన్నారు.