ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ అంశం అంటే రెండు చెప్పుకోవచ్చు. ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు, రెండు హిందూ దేవాలయల్లో జరుగుతున్న అవాంచనీయ ఘటనలు.
ఈ రెండు అంశాల ఎపిసోడ్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో అధికార వైసీపీ టార్గెట్ చేస్తోంది. అదే సమయంలో ఏపీలో విగ్రహాల రాజకీయం తారాస్థాయికి చేరింది. విగ్రహాల ద్వంసం వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారని ఏపీ డీజీపీ ప్రకటించడంతో కలకలం రేగింది. ఆయన మీద తెలుగుదేశం, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అయితే మరింత విరుచుకుపడుతోంది.
కాక పుట్టించిన నిమ్మగడ్డ
ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సారి హీట్ పెంచారు. అయితే, షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఈ షెడ్యూల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూనే ఉన్నారు. షెడ్యూల్ పై న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా అధికార పార్టీ నిమ్మగడ్డ ను టార్గెట్ చేసుకుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ డీజీపీని టార్గెట్ చేసుకుంది.
లోకేష్ సంచలనం….
విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ, బీజేపీ నాయకులున్నారన్న డీపీ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. “విగ్రహాలు ధ్వంసం చేసింది దొంగలు, పిచ్చోళ్లని నిన్న చెప్పిన డిజిపి దొరా, నేడు రాజకీయ కుట్ర కోణంవైపు మీ మాటెందుకు తిరిగింది! రాత్రికి తాడేపల్లి కొంపలో సీఎం జగన్ మార్క్ భోగి పళ్లేమైనా మీకు పోశారా? మీరు విడుదల చేసిన జాబితాలో కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూల్చేసిన వైసీపీ నేత దామోదర్ రెడ్డి పేరు లేదేం? ఓంకార క్షేత్రంలో అర్చకులను చితక్కొట్టిన వైసీపీ నేత ప్రతాపరెడ్డి పేరు ప్రస్తావించలేదెందుకు? ఆంజనేయుడు చేయి విరిగితే రక్తమొస్తుందా? రాముడి తల తెగితే విగ్రహం ప్రాణం పోతుందా? అని హిందుత్వంపైనే దాడికి దిగిన బూతుల మంత్రి నానిపై కేసు ఎందుకు పెట్టలేదు? హిందుత్వం మనుగడనే ప్రశ్నించేలా దాడులు జరుగుతుంటే నిందితులను పట్టుకోవడం చేతకాక చేవచచ్చిన మీపై ముందు కేసుపెట్టాలి. తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు కోర్టులు మీపై సుమోటోగా కేసు నమోదు చేయాలి.” అంటూ లోకేష్ మండిపడ్డారు.