Dhulipalla: వదల బొమ్మాళీ నిన్ను వదల అన్నట్లు…గుంటూరు జిల్లా టీడీపీ నేత దూళిపాళ నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రం ప్రయోగించింది. ఇంతకు ముందు సంగం డెయిరీలో చైర్మన్ హోదాలో ఉన్న దూళిపాళ్ళ నరేంద్ర అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఆనంతరం ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. ఆ తరువాత ఆయన విజయవాడలోని ఓ హోటల్ లో సంగం డెయిరీ బోర్డు మీటింగ్ ఏర్పాటుకు సమావేశమైతే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మరో కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో ప్రభుత్వం సంగం డెయిరీని ఏపి పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థకు అప్పగిస్తూ జీవోను విడుదల చేసింది.
Dhulipalla: డీవీసీ ట్రస్ట్ స్వాధీనానికి నోటీసు
సదరు ప్రభుత్వ జీవోపై చైర్మన్ దూళిపాళ్ళ నరేంద్ర హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన జివోను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని దూళిపాళ్ళ నరేంద్ర నింపాదిగా ఉండగా… ప్రభుత్వం ఇప్పుడు ఆయనపై మరో అస్త్రం ప్రయోగించింది. దూళిపాళ్ల వీరయ్య చౌదరి (డీవీసీ) మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగం డెయిరీకి అనుబంధంగా డీవీసీ ఆసుపత్రి నడుస్తొంది అన్నది అందరికీ తెలిసిందే. పాల రైతులకు, వారి కుటుంబ సభ్యులకు 50 శాతం రాయితీతో డీవీసీ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తోంది. ఈ ట్రస్ట్ కు దూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ గా ఉన్నారు.
సంగం డెయిరీ సాధ్యం కాలేదు.. ట్రస్ట్ ఏమవుతుందో..?
అయితే తాజాగా పాల రైతులకు ఉపయోగపడుతున్న ఈ డీవీసీ మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని 6 ఏ కింద ట్రస్ట్ ఎందుకు స్వాధీననం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ ఈ నోటీసులను జారీ చేశారు. వారం రోజుల్లో ఈ నోటీసుకు సమాధానం ఇవ్వాలని కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. గతంలో సంగం డెయిరీ స్వాధీనానికి ప్రయత్నించి భంగపడిన ప్రభుత్వం..ఇప్పుడు మరో విధంగా డీవీసీ మెమోరియల్ ట్రస్ట్ స్వాధీనానికి అడుగులు వేయడం ప్రాధాన్యతను సంతరించుకోంది. దీనిపై దూళిపాళ నరేంద్ర, ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఓ పక్క రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ టీడీపీ విమర్శలు చేస్తున్న క్రమంలోనే ఒకటి తరువాత ఒకటిగా దూళిపాళ నరేంద్ర పై జరుగుతున్న ప్రభుత్వ చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.