ఏపి ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో సభలు, ర్యాలీలపై జీవో నెం.1 తీసుకురావడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ జీవో తీసుకువచ్చిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆ జివోపై ప్రజల్లోకి తీసుకువెళుతున్న నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపి లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి జీవో 1పై పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలపై నిషేధం లేదని, షరతులకు లోబడి అనుమతి ఇస్తామని చెప్పారు. 1891 పోలీస్ యాక్ట్ కు లోబడే జీవో-1 జారీ చేశామని చెప్పారు.
రాష్ట్రంలో సభలు, సమావేశాలపై బ్యాన్ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. కొన్ని కీలక ప్రాంతాల్లోనే వీటిని నియంత్రించాలని చెప్పామన్నారు. శ్రీకాకుళంలో జనసేన మీటింగ్ కు అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇటీవల జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకునే జీవో తీసుకొచ్చామని ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభలు నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు. హైవేలపై పబ్లిక్ మీటింగ్స్ పెట్టకూడదని చెప్పామన్నారు. ర్యాలీలు, సభలకు షరతులకు లోబడి అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోపై వాస్తవాలను ప్రజలకు మీడియా వెల్లడించాలని ఆయన తెలిపారు. రహదారులపై సభలకు అనుమతి లేదనీ, అది కూడా అత్యవసరమైతే అనుమతులతో నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఉద్దేశం నిషేదం కాదనీ ఆయన స్పష్టం చేశారు.
ప్రజల రక్షణ, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జీవో నెం.1 ను తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత చట్టం దేశ వ్యాప్తంగా అమలవుతున్నదేనని అన్నారు. లా అండ్ ఆర్డర్ డీఐజీ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రహదారులపై సభలు వద్దన్నామని తెలిపారు. మరీ అత్యవసర పరిస్థితుల్లో అనుమతులు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సన్నగా, ఇరుగ్గా ఉండే రోడ్ల మీద సభల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. అంబులెన్స్, విమాన ప్రయాణాల వారికి సమస్యలు తేవద్దని సూచించారు. పబ్లిక్ గ్రౌండ్లలో సభలు జరుపుకోవాలని జీవో లో ఉందని ఆయన పేర్కొన్నారు.
మరో పక్క ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1ను సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర నేత రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ జోవోకు చట్టబద్దత లేదని, ప్రతిపక్షాల సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుపుకోవడానికి వీలులేకుండా ఈ జీవో తీసుకువచ్చిందని పేర్కొన్నారు.