ఏపీ, తెలంగాణ హైకోర్టు లకు నూతన సీజేల నియామకం ఖరారైంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ అలోక్ అరాధేలు నియమితులైయ్యారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మే నెలలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో హైకోర్టు సీజే పోస్టు ఖాళీ ఏర్పడింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది.
మరో వైపు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధేను తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సూచించింది. సుప్రీం కోర్టు కొలీజియం ఏపీ, తెలంగాణతో సహా ఏడు రాష్ట్రాల హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను సిఫార్సు చేసింది. గుజరాత్ కు సునీతా అగర్వాల్, ముంబాయికి దేవేందర్ కుమార్, మణిపూర్ కు సిద్ధార్ద మృదుల్, కేరళకు అశిష్ దేశాయ్, ఒడిశాకు సుబాసిస్ తలపత్ర సీజేలు గా నియమితులైయ్యారు.