Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ … రెండు తెలుగు రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా? ఎన్నికలు. ఓ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతుంటే…మరోరాష్ట్రంలో ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. మరోవైపు ఏపీలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు నేడు రాబోతున్నాయి.
తెలంగాణ లో ఇదీ పరిస్థితి….
రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 17న కౌంటింగ్ జరనగుంది. పోలింగ్కు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి పోలింగ్ సామాగ్రిని ఆయా నియోజకవర్గాలకు పంపిణీ చేశారు. రాజకీయ పార్టీలన్నీ పోలింగ్ విజయవంతంగా జరిగేందుకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కోరారు.
Andhra Pradhesh ఏపీలో హాట్ హాట్…-
మరోవైపు ఏపీలో నేడు విడుదలయ్యే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభం అవుతుంది. విశాఖ కార్పొరేషన్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో జరగనుంది. విశాఖలో ఎనిమిది జోన్లు ఉండగా ఒక్కో జోన్కు ఒక్కో బిల్డింగ్ కేటాయించారు. మొత్తం 98 వార్డులకు 98 గదుల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా.. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సుల్ని తెప్పించి 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టుకుంటూ వెళ్తారు. అన్ని వార్డుల్లోనూ ఈ ప్రక్రియ పూర్తవటానికి మధ్యాహ్నం 12 అవుతుందని అంచనా. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఉత్కంఠ నెలకొంది.