ఏపి అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. మొత్తం అయిదు రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బీఏసీలో టీడీపీ 27 అంశాలపై చర్చకు ప్రతిపాదించగా ప్రభుత్వం అంగీకరించింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు (అచ్చెన్న) కి సీఎం జగన్ బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. మీరు ఏ అంశం కావాలన్నా సభలో చర్చకు తాము రెడీ, సభలో చర్చకు సహకరిస్తారా అని అచ్చెన్నతో సీఎం జగన్ అన్నట్లు సమాచారం. మీరు కోరే ప్రతి అంశంపై చర్చిస్తాం, అవసరమైతే ఈఎస్ఐ స్కామ్ పైనా చర్చిద్దాం అని అన్నట్లు తెలుస్తొంది. రాజధాని అంశంపై కావాలన్నా అది కూడా చర్చ పెడదామని సీఎం అన్నారుట. ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించిన అంశంలోనే అచ్చెన్నాయుడును గతంలో ఏపి సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడుతో అవసరమైతే ఆ అంశంపైనా చర్చిద్దామని జగన్ పేర్కొనడం గమనార్హం.
బీఏసీ సమవేశంలో బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రసాదరాజు, జోగి రమేష్ పాల్గొన్నారు. మరో పక్క అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి. ఉద్యోగాల అంశంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై స్పీకర్ అంగీకరించకపోవడంతో టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. సభను అదుపు చేయడానికి స్పీకర్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు. టీడీపీ సభ్యుల తీరుపై అధికార పక్షం మండిపడింది.
ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం .. టీడీపీ ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు