AP Assembly Budget Session 2022: ఏపి అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా మూడవ రోజూ టీడీపీ ఆందోళన కొనసాగించింది. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరపాలంటూ టీడీపీ పట్టుబట్టింది. బడ్జెట్ సమావేశాల్లో ఏడో రోజైన బుధవారం సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై స్పీకర్ అనుమతించలేదు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తున్న క్రమంలో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ గందరగోళ పరిస్థితికి తీసుకురావడంతో స్పీకర్ వారిని హెచ్చరించారు.
టీడీపీ సభ్యుల తీరును మంత్రులు తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు రోజు సభను అడ్డుకుంటున్నారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. శవరాజకీయాలు చేయడంలో టీడీపీ దిట్ట అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. జంగారెడ్డిగూడెం ఘటన టీడీపీకి కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ఉందని ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెంలో పరామర్శకు రాజకీయ యాత్రగా వెళ్లారని కన్నబాబు విమర్శించారు. సభలో టీడీపీ సభ్యులు నిరసన కొనసాగిస్తున్న నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.
జంగారెడ్డిగూడెం ఘటనపై మొన్న సోమవారం టీడీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో అచ్చెన్నాయుడుతో సహా అయిదుగురిని ఈ బడ్జెట్ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారామ్. నిన్న మంగళవారం టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించగా ఒక్క రోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మూడవ రోజు టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు.