AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 7వ రోజు గురువారం నాడూ టీడీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మద్యం, నాటుసారాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ నిరసన చేపట్టారు. ప్లకార్డులతో సభ్యులు నినాదాలు చేయడంతో స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా నాల్గవ రోజు టీడీపీ సభ్యులు సభలో ఆందోళన నిర్వహించడంపై అధికార పక్షం మండిపడింది.
సభలో రోజూ గందరగోళం సృష్టించాలన్నదే టీడీపీ లక్ష్యం అంటూ వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభను సజావుగా సాగనివ్వరనీ, చంద్రబాబు ఆదేశాల మేరకే వారు ఆందోళన చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. టీడీపీ సభ్యులకు రోజు ఏదో విధంగా సభను అడ్డుకోవడం అలవాటుగా మారిందని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా టీడీపీ శవరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ సభ్యులు ఆందోళన మధ్యనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగిస్తున్నారు.