AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యులు రెండవ రోజూ తమ ఆందోళన కొనసాగించారు. ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చ చేపట్టాలని ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాలంటూ టీడీపీ పట్టుబట్టింది. కల్తీ సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలంటూ ఆందోళన చేస్తున్నారు. నకిలీ బ్రాండ్ల బాగోతం వెలికితీయాలి, కల్తీ సారా మరణాలపై జూడీషియల్ విచారణ వేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. మద్యపాన నిషేదం ఏమైందంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నిన్న ఇదే అంశంపై ఆందోళన చేసిన నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడుతో సహా అయిదుగురిని సమావేశాల నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
AP Assembly Budget Session: టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే ప్రశ్నోత్తరాలు
టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. టీడీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించుర. రోజు సభ ప్రారంభం కాగానే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ప్రశ్నలకు సమాధానాలు వినే ఓపిక కూడా టీడీపీ సభ్యులకు లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్షం లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని అన్నారు. శవరాజకీయాలను టీడీపీ ఇంకెన్ని రోజులు చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు.
వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇస్తూ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటివద్దే ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఏపిలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేదన్నారు. ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో పేదలకు అండగా ప్రభుత్వం ఉందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.