AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 11వ రోజైన బుధవారం ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలనీ, న్యాయవిచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పలువురు టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి చిడతలు వాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ ఇది సరైన పద్ధతి కాదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. టీడీపీ సభ్యుల తీరును అధికార పక్షం తప్పుబట్టింది.
Read More: TDP Leaders House Arrest: నాటు సారాపై నిరసనకు పిలుపు ఇచ్చిన టీడీపీ.. పలువురు నేతల హౌస్ అరెస్టు
AP Assembly Budget Session: ఎన్నికల తరువాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించుకోవాల్సిందే
సభను అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులను బయటకు పంపాలని అధికారపక్ష సభ్యులు స్పీకర్ ను కోరారు. చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ సభ్యులు సభలో ఈ గందరగోళం చేస్తున్నారనీ, ఏదో రకంగా గొడవ చేసి సస్పెండ్ చేయించుకోవాలన్నట్లుగా ఉందని వైసీపీ సభ్యులు అన్నారు. నిన్న విజిల్స్ తీసుకువచ్చారు. ఈ రోజు చిడతలు తీసుకువచ్చారు. రేపు ఏమి తీసుకువస్తారో అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల తరువాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. సభలో టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే మద్యం సేవించి అలా ప్రవర్తిస్తున్నారేమో అన్న అనుమానం కలుగుతోందని, వారికి డ్రంక్ టెస్ట్ చేయించాలని వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.
ప్రశ్నోత్తరాల అనంతరం పవర్ కార్పోరేషన్ వార్షిక నివేదికను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సభ ముందు ఉంచనున్నారు. అనంతరం అధికార భాష సవరణ బిల్లును మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సభ ముందు ఉంచనున్నారు. పలు బడ్జెట్ బిల్లులకు కూడా సభ ఆమోదం తెలపనుంది.