AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీలో అయిదవ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. కాగా టీడీపీ సభ్యుల ఆందోళనతో శాసనసభ మొదలైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ప్రశ్నోత్తరాలు చేపట్టిన వెంటనే.. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై సభలో టీడీపీ ఆందోళనకు దిగింది. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని టీడీపీ పట్టుబట్టింది. సీఎం రాజీనామా చేయాలంటూ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Assembly Budget Session: వాయిదా తీర్మాానంకై పట్టుబట్టిన టీడీపీ
టీడీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మంత్రులు సిద్ధంగా ఉన్నా, టీడీపీ సభ్యులు ప్రతి రోజు సభను అడ్డుపడుతోందంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సభను అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని మంత్రి బుగ్గన మండిపడ్డారు. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన అన్నారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో సభ అయిదు నిమిషాలు వాయిదా పడింది. ప్రశ్నాత్తరాల అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగిస్తారు. తదుపరి బడ్జెట్ పై చర్చ ప్రారంభమవుతుంది. కాగా మరి కొద్దిసేపటిలో శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.