AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమైయ్యాయి. జంగారెడ్డగూడెం మరణాలపై టీడీపీ సభ్యులు ఆదిరెడ్డి భవానీ తదితరులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని తిరస్కరించారు. కల్తీ సారా మరణాలపై చర్చ జరగాలనీ, జూడిషియల్ విచారణ డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇదే సందర్భంలో పశ్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెగాసస్ సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
పెగాసస్ అంశాన్ని సుప్రీం కోర్టు సీరియస్ గా తీసుకుని రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్న నేపథ్యంలో చంద్రబాబు హయాంలో పెగాసస్ కొనుగోలు అంశంపై చర్చించి రిపోర్టును కమిటికి అందించాల్సిన బాధ్యత ఉందని మంత్రి అన్నారు. పెగాసస్ కొనాలని తమ వద్దకు వచ్చినట్లు నాటి ఐటి మంత్రి నారా లోకేష్ చెప్పారనీ.. పెగాసస్ పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా అన్నారు. పెగాసస్ చర్చకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీసు ఇవ్వగా, ప్రశ్నోత్తరాల అనంతరం స్వల్ప కాలిక చర్చ చేపడతామని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు.
కాగా టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలను కొనసాగిస్తున్నారు. ప్రశ్నోత్సరాల అనంతరం పలు సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. హీందూ చారిటబుల్ సవరణ బిల్లును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఫారిన్ లిక్కర్ సవరణ బిల్లును మంత్రి నారాయణ స్వామి ప్రవేశపెట్టనున్నారు. స్కిల్ డవలప్ మెంట్, టూరిజం, మెడికల్ అండ్ హెల్త్, విద్యాశాఖ సంబంధించిన బడ్జెట్ డిమాండ్ గ్రాంట్స్ పై ఓటింగ్ చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరుపనున్నారు.