టీడీపీ ఎమ్మెల్యేలు కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు ప్రివిలేజ్ కమిటీ షాక్ ఇచ్చింది. వారం రోజుల్లో వారిద్దరికీ నోటీసులు ఇవ్వాలని ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. బుధవారం ప్రివిలేజ్ కమిటీ సమవేశం గంటకు పైగా జరిగింది. స్పీకర్ రిఫర్ చేసిన కారణంగా తొలుత అచ్చెన్నాయుడికి నోటీసులు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. తరువాత చీఫ్ విప్ సభలో తీర్మానం చేసినందున నిమ్మల రామానాయుడుకి కూడా నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన అనంతరం పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కమిటీ తెలుపనున్నది.
అయితే గతంలో టీడీపీ ఇచ్చిన సభా హక్కుల నోటీసుపై కమిటీలో చర్చ జరగలేదు. సరైన ఫార్మెట్ లేని కారణంగా వీటిపై చర్చ జరపలేమని కమిటీ స్పష్టం చేసింది. తదుపరి ప్రివిలేజ్ కమిటీ సమావేశం వచ్చే జనవరి 18 లేదా 19 తేదీల్లో తిరుపతిలో జరగనున్నది.
కాగా ఈ కమిటీ సమావేశంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. సీఎం వైఎస్ జగన్, మంత్రి కన్నబాబుపై ఇచ్చిన టీడీపీ ఇచ్చిన నోటీసుపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే కమిటీ అంగీకరించకపోవడంతో టీడీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి స్పందిస్తూ అచ్చెన్నాయుడుపై స్వయంగా స్పీకరే రిఫర్ చేశారనీ, రామానాయుడుపై అసెంబ్లీలో తీర్మానమే చేయడం జరిగిందన్నారు.