ఏపి అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమైయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ రోజు ఏపి ప్రభుత్వం ఎనిమిది కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. మరో వైపు కడప స్టీల్ ప్లాంట్ పై టీడీపీ సభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయులు, అచ్చెన్నాయుడు ప్రశ్నపై చర్చ జరుగుతోంది. టీడీఎల్పీ ఉప నాయకుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారన్నారు. విభజన చట్టంలోనే కేంద్రం స్పష్టంగా హామీ ఇచ్చినా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మూడేళ్లు అవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తున్నా మాట్లాడటం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని కల్పించుకుని.. టాపిక్ ను పక్కదోవ పట్టించొద్దని, కడప స్టీల్ ప్లాంట్ పైనే మాట్లాడాలని, వేరే విషయం గురించి మాట్లాడవద్దని చెప్పారు. అనంతరం అచ్చెన్నాయుడు కొనసాగిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి అయినా సరే కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తొందన్నారు. దీనిపై మంత్రి గుడివాడ అమరనాథ్ సమాధానం ఇచ్చారు. పర్యావరణ సమ్మతి ఇవ్వడం జరిగిందనీ, ఇప్పటి వరకూ మౌళిక సదుపాయాలు ఇతరత్రాలకు రూ.46.57 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు.
టీడీపీ వాళ్లకు పరిశ్రమలపై మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఈ రోజు పారిశ్రామక ప్రగతిపై చర్చలో మాట్లాడదామన్నారు. పరిశ్రమలు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తూ అడ్డుకోవాలని ప్రయత్నిస్తొందని మంత్రి విమర్శించారు. పరిశ్రమలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మంత్రి వివరించారు. టీడీపీ సభ్యులు ప్రభుత్వం పై విమర్శ చేస్తున్న క్రమంలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కల్పించుకుని టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేయడం తెలిసిందేన్నారు. అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరిగింది.