AP Assembly Sessions: ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మూహూర్తం ఫిక్స్ అయ్యింది. కోవిడ్ ప్రోటోకాల్ మధ్య ఈ నెల 18వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాధమిక సమాచారం మేరకు వారం రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు సభను నిర్వహించనుంది. ఆ తర్వాత 20,21 వ తేదీలు శని, ఆదివారాలు రావడంతో ఆయా దినాలను సెలవు దినాలుగా ప్రకటించి తిరిగి 22వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి అయిదు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే 18వ తేదీన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసి) సమావేశంలో సమావేశ పని దినాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
AP Assembly Sessions: చర్చించే అంశాలపై ప్రణాళిక సిద్ధం
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్ష టీడీపీ లేవనెత్తే అంశాలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని అధికార పక్షం భావిస్తోంది. నిత్యావసర వస్తవుల ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణ, అప్పులు, అమ్మఒడి తదితర అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్షం పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి మాక్ అసెంబ్లీ నిర్వహించిన టీడీపీ.. ఈ సమావేశాల్లో ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది అన్నది ఆశక్తికరంగా మారుతోంది. అధికార పక్ష సభ్యుల నుండి తీవ్ర స్థాయిలో అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ సమావేశాలను బహిష్కరిస్తుందా లేక సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని వివిధ సమస్యలపై నిలదీస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.
17న ఏపి కేబినెట్ భేటీ
18వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం దానికి ఒక్క రోజు ముందు 17వ తేదీ కేబినెట్ భేటీ అవుతోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టదల్చిన పలు ముసాయిదా తీర్మానాలను మంత్రివర్గం ఆమోదించనున్నది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు.
17నే మున్సిపల్ ఫలితాలు
అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నెల 15న నెల్లూరు కార్పోరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. 17వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రానికి ఫలితాలు వెల్లడికానున్నాయి.