ఈ నెల 15వ తేదీ నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయిదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే నిర్వహించే బీఏసీ సమావేశం లో అసెంబ్లీ పని రోజులపై నిర్ణయం తీసుకుంటారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల అంశంపై ఏపి హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంది. అయితే అదే సందర్భంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా మెరుగైన విధంగా మూడు రాజధానుల బిల్లు తీసుకువస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించి ఉన్నారు. రీసెంట్ గా మంత్రి గుడివాడ అమరనాథ్ తో సహా పలువురు మంత్రులు మూడు రాజధానుల ఏర్పాటే తమ పార్టీ, ప్రభుత్వ విధానమని స్పష్టం చేయడంతో ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గతంలో శాసనసభలో ఆమోదం పొందిన బిల్లు శాసనమండలిలో వైసీపీకి బలం లేకపోవడంతో పాస్ కాలేదు. ఇప్పుడు శాసనమండలిలోనూ అధికార పార్టీకి సంఖ్యాబలం ఉండటంతో ఉభయ సభల్లో మూడు రాజధానుల అంశానికి సంబంధించి కొన్ని మార్పులతో ప్రవేశపెట్టి ఉభయ సభల్లో ఆమోదించుకునే అవకాశం ఉందని అంటున్నారు. గత సమావేశంలో చట్టసభల అధికారాల్లో న్యాయవ్యవస్థ జోక్యంపై సుదీర్ఘంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమావేశాల్లో మరి కొన్ని కీలక బిల్లులను సైతం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.