AP Assembly sessions : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ ముహూర్తం ఖరారు అయ్యింది. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సస్పెన్స్ కు తెరపడింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు కరోనా కేసుల పెరుగుదల, కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడినట్లు సమాచారం. బడ్జెట్ కోసం మరోసారి అర్డినెన్స్ పెట్టడమా లేక ఓటాన్ అకౌంట్ కు వెళ్లడమా అనే దానిపైనా సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ నెల 14 వ తేదీ పురపాలక సంఘ ఎన్నికల కౌంటింగ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహణకు సీఎం వైఎస్ జగన్ YS Jagan గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమావేశాలకు సంబంధించి తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. మార్చి 19వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశాల్లోనే 2021-22 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నది. సమావేశాలను ఈ నెలాఖరు వరకూ నిర్వహించే అవకాశం ఉంది. 19న జరిగే బీఎసీ సమావేశంలో ఎన్ని రోజులు సెషన్స్ నిర్వహించాలనేది నిర్ణయిస్తారు.
ఈ సమావేశాల్లో బడ్జెట్ తో పాటు కీలకబిల్లులను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తున్నది. బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ TDP వ్యూహాలు సిద్దం చేస్తుండగా ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ YCP సిద్దం అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ Visakha Steel Plant ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఇంతకు ముందే సీఎం జగన్ ప్రకటించారు. ఈ అంశంపై చర్చలో అధికార పక్షాన్ని తీవ్రస్థాయిలో విమర్శించేందుకు టీడీపీ సిద్ధం అవుతున్నది.