AP Assembly sessions: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. 2021 -2022 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 2 లక్షల 11వేల కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత కె అచ్చెన్నాయుడు తెలిపారు. తూతూ మంత్రంగా ఒక రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు తాము హజరు కాలేమని అన్నారు. ఆరు నెలలు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. బడ్జెట్ పై పూర్తి స్థాయి చర్చ జరగకుండా తూతూ మంత్రంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. అందుకే సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కరోనా కష్ట కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించకుండా ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టడం ఏమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కరోనా కట్టడి కోసం సీఎం జగన్మోహన రెడ్డి ఆలోచించడం లేదని విమర్శించారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒక్క సారి అయినా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలను చూసి అయినా సీఎం జగన్ నేర్చుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతల సూచనలు, సలహాలు తీసుకోవాలన్న ఆలోచన జగన్ చేయాలన్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యం వల్లనే ఆక్సిజన్ అందక రాష్ట్రంలో 106 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు పడకలు, మందులు, ఆహారం అందడం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తమిళనాడు, కేరళ తరహాలో కరోనా రోగులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో అక్కడి సీఎం స్టాలిన్ కరోనా పరిస్థితులపై అఖిలపక్ష నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే.