AP Assembly: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 11వ రోజైన బుధవారం టీడీపీ సభ్యులు కల్తీ మద్యంపై గొడవ కొనసాగిస్తున్న నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిడతలు వాయిస్తూ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. పలు మార్లు స్పీకర్ వారించినా టీడీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. అధికార పక్ష సభ్యులు, మంత్రులు టీడీపీ సభ్యుల తీరును తప్పుబడుతూ వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. సభ సజావుగా జరగాలంటే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాల్సిందేనన్నారు. స్పీకర్ ఆదేశాలతో టీడీపీ సభ్యుల నుండి చిడతలను మార్షల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత కూడా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు.
Read More: AP Assembly Budget Session: అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు..స్పీకర్ తమ్మినేని సీరియస్
AP Assembly: టీడీపీ సభ్యులు రెండు రోజుల పాటు సస్పెండ్
టీడీపీ సభ్యులు ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారంటూ వారి తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సభా నిర్వహణకు నిమిషానికి 88,902 లు ఖర్చు అవుతుందని తెలుసా అంటూ టీడీపీ సభ్యులను ప్రశ్నించారు స్పీకర్ తమ్మినేని. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులను రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ తమ్మినేని. పదేపదే సభా కార్యక్రమాలను అడ్డుతగలడంతో పాటు ఈలలు వేయడం, చిడతలు తెచ్చి వాయించడం వంటివి సభా గౌరవ మర్యాదలను కించపర్చే విధంగా ఉన్నాయని స్పీకర్ అన్నారు.
టీడీపీ సభ్యుల అనుచిత చర్యలపై ఎథిక్స్ కమిటీ విచారణ
మరో పక్క టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన పై ఎథిక్స్ కమిటీ విచారించాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆదేశాలు జారీ చేశారు. ఎథిక్స్ కమిటీ విచారించి తగిన చర్యలు సూచించాలని స్పీకర్ కోరారు. స్పీకర్ పైనే కాగితాలు చించి విసిరివేయడం, ఈలలు వేయడం, చిడతలు వాయించడం లాంటి చర్యలను స్పీకర్ తమ్మినేని సీరియస్ గా పరిగణించారు. ఎథిక్స్ కమిటీ సూచనల మేరకు చర్యలు ఉంటాయని స్పీకర్ వెల్లడించారు.