BJP : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ డిబేట్ లో బీజేపీ నాయకుడు విష్ణువర్థన్ రెడ్డిపై అమరావతి జేఏసి నేత డాక్టర్ శ్రీనివాసరావు చెప్పుతో దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు తదితర నేతలు తీవ్రంగా ఖండించారు. అయితే జరిగిన ఘటనపై నేడు అమరావతి జెఏసీ నేత శ్రీనివాసరావు నేడు విచారం వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని తనను పెయిడ్ అర్టిస్ట్ అని సంబోధించడం వల్ల ఆవేశంతో జరిగిన ఘటనగా ఆయన పేర్కొన్నారు. గతంలో విష్ణువర్థన్ రెడ్డికి తనకు పరిచయం కూడా లేదని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏబిఎన్ ఛానల్ విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలు గాలికొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక, ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని బీజెపీ బహిష్కరిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర మీడియా ఇన్ చార్జి వుల్లూరి గంగాధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. నిన్నటి చర్చా వేదికలో తమ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయించకుండా తిరిగి ఈ రోజు చర్చకు ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రయత్నించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
నేటి నుంచి బీజేపీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఆహ్వానించరాదని, ఆ టీవీ చానల్ చర్చా కార్యక్రమాలలో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర బిజెపి ఇచ్చిన ఈ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘించి ఎబిఎన్ ఛానల్ తనకు నచ్చిన వారిని ఆహ్వానించి, వారిని పార్టీ వాయిస్గా ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తే ఏబిఎన్ ఛానెల్పై చట్టపరమైన చర్యలతో పాటు ఇతర అనువైన చర్యలకై బిజెపి ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా బీజేపీ రాష్ట్ర శాఖకు క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందని గంగాధర్ పేర్కొన్నారు.