ఏపిలో ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఫిబ్రవరి 4వ తేదీ నుండి వారం రోజుల పాటు యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీన తిరుపతి కపిలతీర్థం నుండి విజయనగరం జిల్లా రామతీర్థం వరకూ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దాడులకు గురైన ఆలయాలను సందర్శిస్తూ తమ యాత్ర కొనసాగుతుందన్నారు. ఫిఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. హిందూత్వానికి జరుగుతున్న విఘాతంపై పోరాడతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. దేవాలయాలు నిర్మాణాలు చేసే పార్టీని కూల్చే పార్టీగా డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ నెల 20వ తేదీలోగా డీజీపీ క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలపై వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజెపీ, టీడీపీలు విమర్శిస్తుండగా, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు దీనిలో ప్రతిపక్షాల కుట్ర కోణం దాగి ఉందని అధికార వైసీపీ ఎదురుదాడి చేస్తుంది. అధికార పార్టీ నేతల విమర్శలకు డీజీపీ గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లు అయ్యింది. ఆలయాలపై దుష్ప్రచారాల వెనుక రాజకీయ పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అధికార, ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ యాత్రకు సన్నద్దం అవుతోంది. ఇటీవల బీజెపీ నేతలు చేపట్టిన చలో రామతీర్థం కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి, టీడీపీ నేత చంద్రబాబు ను రామతీర్థం ఆలయ సందర్శనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం బీజెపీ నేతలకు అనుమతి ఇవ్వలేదు. రెండు పర్యాయాలు బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. ఈ తరుణంలో బీజేపీ చేపడుతున్న యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదో వేచి చూడాలి.