బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కడప జిల్లా పొద్దుటూరులో టీడీపీ నేత దారుణ హత్య, విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై శ్రీరాముడి విగ్రహం ధ్వంసం, హింధూ ఆలయాలపై జరిగిన దాడుల్లో నిందితులను అరెస్టు చేయకపోవడం తదితర కారణాలను పేర్కొంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయనీ, ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీస్ వ్యవస్థ దారుణంగా విఫలమైందనీ విమర్శించారు సోము వీర్రాజు, ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు, దాడులు, హత్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ఆయన ఆదోళన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా, ఇళ్ల స్థలాల కుంభకోణాలకు పాల్పడుతుంటే వాటిని బయటపెట్టడం, ప్రశ్నించడం ప్రతిపక్షాల విధిగా ఆయన పేర్కొన్నారు. తప్పును బయటపెడితే సరిదిద్దుకోవాల్సింది పోయి హత్యలకు పాల్పడటం కిరాతక చర్యగా సోము పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ కార్యకర్తను నిర్ధాక్షిణ్యంగా నరికి చంపడం అత్యంత హేయమైన చర్యగా సోము అబివర్ణించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అడుగంటాయని విమర్శించారు. అధికార పార్టీకి పోలీసులు దాసులుగా మారడం, నేరస్తులపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి చర్యలు కొనసాగుతున్నాయని ఆక్షేపించారు. తక్షణం హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. కొండబిట్రగుంట, పిఠాపురం, అంతర్వేదిలో హిందూ ఆలయాల ధ్వంసం కేసుల్లో నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని సోము ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం కారణంగానే హిందూ ధర్మంపై దాడులు, విధ్వంసాలు కొనసాగుతున్నాయని భావించాల్సి వస్తోందని అన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హింధూ ధర్మంపై దాడులు ఆపకుంటే హిందువుల ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తోందని సోము హెచ్చరించారు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే..మీడియా సమావేశాల్లో, ఇతర సందర్భాలలో టీడీపీ, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే సోము వీర్రాజు తన పత్రికా ప్రకటనలో మాత్రం టీడీపీ అనే పేరు, పొద్దుటూరులో హత్యకు గురైన నాయకుడు సాంబయ్య అనే పేరు గానీ ప్రస్తావించలేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ రాజకీయ కార్యకర్తను నిర్ధాక్షిణ్యంగా నరికి చంపడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించడం గమనార్హం.