ఏపిలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ రాజకీయ పార్టీల పొత్తుల అంశంపై రకరకాల కథనాలు వినబడుతున్నాయి. విశాఖలో జరిగిన పరిణామం అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు కలవడంతో టీడీపీ – జనసేన బంధం బహిర్గతం అయ్యిందంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రోడ్ మ్యాప్ పై బీజేపీ స్పందించకపోవడంపై పవన్ కళ్యాణ్ తన అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించారు. దీంతో బీజేపీతో జనసేన దూరం అవుతోందనీ, టీడీపీతో జత కడుతుందని టీవీల్లో డిబేట్ లు ప్రారంభం అయ్యాయి. ఇదే తరుణంలో సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. బీజేపీ తో జనసేన పొత్తు దెబ్బతింటే అందుకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజే కారణమనే విధంగా కన్నా వ్యాఖ్యానించారు.
ఏపిలో అధికార వైసీపీని ఢీకొట్టాలంటే ప్రజాబలం, ఓటు బ్యాంకు లేని బీజేపీతో కలిసి పోరాటం చేస్తే సరిపోదన్న భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ముక్కోణపు పోటీ జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వల్ల అధికార వైసీపీకే లాభం చేకూరుతుందన్న ఆలోచనలో జనసేన ఉంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయకూడదు అన్న భావనలోనే వైసీపీ కూడా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్దులను పోటీకి నిలపాలని ఛాలెంజ్ విసురుతున్నారు.
అయితే తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ ఏపి కోఆర్డినేటర్ సునీల్ ధియోధర్ స్పందించారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని ఆయన మరో మారు స్పష్టం చేశారు. వైసీపీ – టీడీపీ ల్లో ఒకరు నాగరాజు.. మరొకరు సర్పరాజు అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. వైసీపీ – టీడీపీ లు రెండూ దొంగల పార్టీలేనని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండదు అంటూ తేల్చి చెప్పారు. వైసీపీ పోరాటం కొనసాగుతుందని చెబుతూనే రోడ్ మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని అన్నారు ధియేధర్. విశాఖ ఘటన విషయంలో బీజేపీ నేతలు చాలా మంది పవన్ తో మాట్లాడారనీ సంఘీభావం తెలిపారని అన్నారు.