AP Cabinet Meeting: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటిలో కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులు కేబినెట్ సమావేశానికి హజరుకావాలని ఆదేశాలు అందాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వరద పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమవేశాలను నేటితో ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అత్యవసర కేబినెట్ బేటీలో కేబినెట్ బేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమచారం. ఇదే సమావేశంలో మూడు రాజధానుల అంశంపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ వెనక్కి తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కేబినెట్ ఆమోదించిన సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టు స్టే ఇవ్వడం, ప్రస్తుతం హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.
దీంతో ఈ బిల్లును వెనక్కు తీసుకుని కొన్ని మార్పులతో మళ్లీ శాసనసభలో మూడు రాజధానుల బిల్లు పెట్టే ఆలోచనను సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం శాసనమండలిలోనూ వైసీపీ బలం పెరిగిన కారణంగా కొద్ది మార్పులతో మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ, మండలిలో ఆమోదించి ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఇదే క్రమంలో వరద కారణంగా నష్టపోయిన ప్రజలు, రైతులను అదుకునే అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
కొద్దిసేపటి క్రితమే వరద సహాయక చర్యలపై సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకో సీనియర్ అధికారిని నియమించి పరిస్థితులను సమీక్షిస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.